Sircilla: 14వ శతాబ్దపు రాచర్ల కోటకు గుర్తింపు కరువు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లోని 14వ శతాబ్దపు రాచర్ల కోట, స్వయంభు విఘ్నేశ్వర ఆలయం గుర్తింపునకు నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
Sircilla: 14వ శతాబ్దపు రాచర్ల కోటకు గుర్తింపు కరువు!
Sircilla: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లోని రాచర్ల కోట చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. 14వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రక కట్టడం సింగమహారాజు, బొప్పరాజుల పాలనకు సంబంధించిన ఆనవాళ్లను కలిగి ఉందని స్థానికులు చెబుతున్నారు. శత్రుదుర్భేద్యమైన నిర్మాణాలు, అగడ్తలు, నాటి ఆయుధ తయారీకి సంబంధించిన ఆనవాళ్లు ఈ కోట ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి.
కోట పరిధిలోని జక్కుల చెరువులో అతి పురాతనమైన స్వయంభు విఘ్నేశ్వర స్వామి కొలువుదీరారు. స్వామివారికి ఆలయం నిర్మించి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోట పరిసరాల్లో పురాతన హనుమాన్, శివాలయాలు కూడా ఉండటంతో ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెరిగింది.
అయితే చారిత్రక ప్రాధాన్యత ఉన్న రాచర్ల కోటకు సరైన గుర్తింపు లేకపోవడంతో ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటలోని చారిత్రక ఆనవాళ్లను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
రాచర్ల కోటను చారిత్రక వారసత్వ ప్రదేశంగా పరిరక్షిస్తూ, స్వయంభు విఘ్నేశ్వర ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కోటను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించడంతో పాటు పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




