Rayachoty: మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ‘స్త్రీ శక్తి’ పథకం!
Rayachoty: రాయచోటిలో టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ కామెంట్స్. ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళల ఆర్థిక స్వావలంబన, ఉచిత బస్సు ప్రయాణంపై హర్షం.
Rayachoty: మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ‘స్త్రీ శక్తి’ పథకం!
Rayachoty: మహిళల దైనందిన జీవితాల్లో ‘స్త్రీ శక్తి’ పథకం వెలుగులు నింపుతోందని రాయచోటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అన్నారు. రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని తెలిపారు.
మహిళలు తమ కుటుంబ అవసరాలతో పాటు ఉద్యోగాలు, విద్య, వైద్యం, వ్యాపారాలు, ఇతర పనుల కోసం ప్రయాణించే సమయంలో రవాణా ఖర్చు భారాన్ని తగ్గించడంలో ఈ పథకం కీలకంగా మారిందని సుధాకర్ పేర్కొన్నారు. అక్కాచెల్లెమ్మల ప్రయాణ సౌకర్యం కోసం ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.3,095 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఏడాది కాలంలో మహిళలు ఏకంగా 90 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రికార్డు సృష్టించారని ఆయన అన్నారు.
ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయాణ ఖర్చు తగ్గడంతో ఆర్థికంగా కొంత ఊరట లభిస్తోందన్నారు.రాయచోటి ప్రాంతంలోనూ స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందని గండికోట సుధాకర్ తెలిపారు.
మహిళలతో పాటు విద్యార్థులు, చిరు వ్యాపారులు ఈ పథకం వల్ల పరోక్షంగా ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. మహిళలు స్వేచ్ఛగా, ఆర్థిక భారం లేకుండా ప్రయాణించేలా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రాయచోటి ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ఇప్పటికే అమలవుతున్న పథకాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని సుధాకర్ ఆకాంక్షించారు.
‘స్త్రీ శక్తి’ పథకం మహిళలకు కేవలం ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సామాజిక, ఆర్థిక సాధికారతకు ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.




