Rayachoti: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై ఆరోపణల ఖండన
Rayachoti: రాయచోటిలో టీడీపీ మహిళా నేతల మీడియా సమావేశం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోమని వైసీపీ నేతలకు హెచ్చరిక.
Rayachoti: రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై ఆరోపణల ఖండన
రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి పై ఆరోపణలు చేయడం తగదని టీడీపీ మహిళా నేతలు హెచ్చరించారు. బుధవారం రాయచోటి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వైసిపి నేతలు, సాక్షి పత్రిక, సాక్షి మీడియా పై విరుచుకుపడ్డారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎర్రచందనం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగిందని ఆరోపించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు నిర్వహించే ప్రజా దర్బార్ కు ప్రజలు, వివిధ వర్గాల వారు తమ సమస్యలను చెప్పుకునేందుకు హాజరవుతుంటారని, ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి వ్యక్తిని మంత్రికి ముఖ్య అనుచరుడిగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
వైసీపీ నాయకుడు, ఎర్రచందనం స్మగ్లర్ తోట వెంకటాద్రి కి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. వైసీపీ నేతల పై ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలను మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆపాదిస్తూ వార్తలు ప్రచారం చేయడం, వాస్తవాలను వక్రీకరించడమేనని విమర్శించారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమ రవాణా, స్మగ్లింగ్ వ్యవహారాలకు కూటమి ప్రభుత్వంలోని మంత్రిని బాధ్యుడిని చేయాలని ప్రయత్నించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని వారు అన్నారు. ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలను కూడా రాజకీయ వివాదాలకు ముడిపెట్టడం మానుకోవాలని సూచించారు.
తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఇక సాగవని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ మహిళా నేతలు పేర్కొన్నారు. అక్రమ దందాలు ఎవరు చేశారో ప్రజలకు బాగా తెలుసునని, వాటిని ఎలాంటి మచ్చలేని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై రుద్దే రాజకీయ జిమ్మిక్కులు ఇక పనిచేయవు అని వారు స్పష్టం చేశారు.




