Rayachoti: రాయచోటిలో ప్రకృతి వ్యవసాయం రైతులకు మంత్రి మండిపల్లి అభినందనలు!
Rayachoti: గాలివీడులో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అవార్డులు అందజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రైతులు పండించిన పంటలను స్వయంగా కొనుగోలు చేశారు.
Rayachoti: రాయచోటిలో ప్రకృతి వ్యవసాయం రైతులకు మంత్రి మండిపల్లి అభినందనలు!
Rayachoti: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి, రైతులకు మరింత మేలు చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గాలివీడు వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఉత్తమ రైతులుగా గుర్తించి మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మంత్రి స్వయంగా కొనుగోలు చేసి, రైతులను ప్రోత్సహించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంటలను పండించడంతో పాటు రైతులకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని మంత్రి రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను ప్రకృతి వ్యవసాయ విధానాలతో సమన్వయం చేసుకుని సాగు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
అనంతరం రైతులు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రి సందర్శించి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, వివిధ రకాల పంటలు, ఆధునిక సాగు విధానాలను పరిశీలించారు. రైతులు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకుని, మరింత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని మంత్రి సూచించారు.
ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఉత్తమ రైతులుగా గుర్తించి అభినందించడం ద్వారా ఇతర రైతుల్లోనూ ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుందని మంత్రి తెలిపారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




