Kadapa: పగలు పెయింటర్.. రాత్రి దొంగ గజదొంగను అరెస్ట్ చేసిన పోలీసులు!
Kadapa: కడప, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో 15 చోరీలకు పాల్పడిన గజదొంగ షేక్ నౌమాన్ అరెస్ట్. 84.76 గ్రాముల బంగారం, కెటిఎం బైక్ స్వాధీనం.
Kadapa: పగలు పెయింటర్.. రాత్రి దొంగ గజదొంగను అరెస్ట్ చేసిన పోలీసులు!
Kadapa: పగటి పూట ఫెయింటర్ గా పనిచేస్తూ.. రాత్రి పూట చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల గజదొంగను కడప జిల్లా వీరబల్లి పోలీసులు అరెస్టు చేశారు.కడప, అన్నమయ్య, కర్నూల్ జిల్లాలలో వరస చోరీలకు పాల్పడుతున్న ఘరాన దొంగ ను కడప జిల్లా వీరబల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 84.76 గ్రాముల బంగారు నగలు, కేటియం బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు కడప జిల్లా సుండుపల్లి మండలం జీకే రాచపల్లె కు చెందిన షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్ గా పోలీసులు గుర్తించారు. కడప జిల్లా వీరబల్లి పోలీస్ స్టేషన్ లో సుండుపల్లి సీఐ సురేష్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందితుడు ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాలను కేంద్రాలుగా ఎంచుకుని వరస దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు.
నిందితుడు ఆగస్టు 10వ తేదీన వీరబల్లి మండలం, వంగిమళ్ళ గ్రామం, దుగనపల్లెలో మల్లూరు రెడ్డెమ్మ ఇంట్లో జరిగిన చోరీ కేసులో వీరబల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. పగటి పూట పెయింటర్ గా పనిచేస్తూ.. రాత్రి పూట దొంగతనాలకు పాల్పడే వాడన్నారు. నిందితుడికి తల్లిదండ్రులు లేక పోవడంతో జులాయిగా మారి జల్సాలకు అలవాటు పడ్డాడని తెలిపారు.
నిందితుడు షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్ అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో 4, కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో 1, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 6, చిన్నచౌక్ లో 1, సీకే దిన్నె లో 1, యర్రగుంట్ల లో 1, వీరబల్లిలో 1 మొత్తం 15 చోరీ కేసులలో ముద్దాయిగా ఉన్నాడని వివరించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసిన వీరబల్లి ఎస్ఐ సుస్మిత, పోలీస్ సిబ్బందిని సీఐ సురేష్ రెడ్డి అభినందించారు.




