Duvvur: వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయకస్వామి 21వ వార్షికోత్సవం
Duvvur: దువ్వూరులో శ్రీ వరసిద్ధి వినాయకస్వామి 21వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నసంతర్పణ, గ్రామోత్సవంలో భక్తులు పాల్గొన్నారు.
Duvvur: వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయకస్వామి 21వ వార్షికోత్సవం
దువ్వూరు: స్థానిక కేసీ కెనాల్ గట్టున కొలువుదీరిన శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన 21వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయ అర్చకులు చైతన్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి సుప్రభాత సేవ, విశేష పంచామృతాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం 9 గంటల నుంచి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆలూరు లక్ష్మీచైతన్య శర్మ ఆధ్వర్యంలో మహాగణపతి హవనం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి హవనం, నవగ్రహ హోమం మరియు షిర్డీ సాయిబాబా ప్రత్యేక హవనాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు విచ్చేసిన భక్తులకు భారీ అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు.
సాయంత్రం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దివ్య గ్రామోత్సవం కన్నులపండువగా సాగింది. దువ్వూరు మెయిన్ రోడ్డు నుండి టీచర్స్ కాలనీ వరకు జరిగిన ఈ రథోత్సవంలో స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.




