Chapadu: నక్కలదిన్నె పిహెచ్సి పరిధిలో ఇంటింటి జ్వరాల సర్వే
Chapadu: నక్కలదిన్నె పిహెచ్సి పరిధిలోని 7 సచివాలయాల్లో ఇంటింటి జ్వరాల సర్వే. కోవిడ్, సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి సూచన.
Chapadu: నక్కలదిన్నె పిహెచ్సి పరిధిలో ఇంటింటి జ్వరాల సర్వే
చాపాడు: చాపాడు మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు ఇంటింటి జ్వరాల సర్వే,లార్వా సర్వే ఏడు సచివాలయాలలో నక్కల దిన్నె వైద్యాధికారి డాక్టర్ పి ఓబులేసు ఆధ్వర్యంలో సర్వేలు జరిగాయి.
నక్కలదిన్నె PHC పరిధిలోని అల్లాడుపల్లి, అయ్యవారిపల్లి, పెద్దగురువలూరు , చిన్నగురువ లూరు, లక్ష్మిపేట,వెదురూరు, ఎన్.ఒబాయపల్లె సచివాలయాల పరిధిలో యం ఎల్ హెచ్ పి లు, ఎ ఎన్ యం లు,మరియు ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించడం, దోమల లార్వా ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చేపట్టారు.
నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, వెదురూరు లో నిర్వహించిన 104 వైద్య శిబిరం నిర్వహించిన తర్వాత,అనంతరం తూర్పు అనంతపురం గ్రామాన్ని సందర్శించి సర్వేలో పాల్గొన్నారు. ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉంచిన డ్రమ్లు, ఇతర పాత్రలను పరిశీలించి, వీధుల్లో నిల్వ ఉన్న నీటిలో పారిశుద్ధ్య సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి ఓబులేసు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అయితే అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా నక్కలదిన్నె. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు.
అలాగే కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లినప్పుడు లేదా లక్షణాలు ఉన్నప్పుడు మాస్క్ ధరించడం, సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ ఉపయోగించడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు ముక్కు, నోటిని రుమాలు లేదా మోచేతితో కప్పుకోవడం, అనారోగ్య లక్షణాలు ఉంటే ఇతరులతో సన్నిహితంగా మెలగకుండా ఉండడం, గదుల్లో తగిన గాలి, వెలుతురు ,ప్రసరణ ఉండేలా చూసుకోవడం, వృద్ధులు, గర్భిణీలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారు కోవిడ్ టీకా, బూస్టర్ డోసులు తీసుకోవడం కూడా రక్షణకు ఉపయోగపడుతుందని తెలిపారు.
అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా చూడడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా డెంగ్యూ, మలేరియా,చికున్గున్యా , జె ఇ, బోదకాలు,వంటి వ్యాధులను కూడా నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి యం రాఘవయ్య సూపర్ వైజర్ ప్రసాద్, యం ఎల్ హెచ్ పి కీర్తి, ఎ ఎన్ యం ఆరోగ్య మేరీ ఆశా కార్యకర్త జయమ్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




