US vs Iran : మళ్లీ రాజుకున్న ప్రపంచ యుద్ధ జ్వాలలు.. ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం

US vs Iran : హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన దాడికి ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని మిసైల్, డ్రోన్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది.

CR Reddy
Published on: 27 Jun 2026 6:29 AM IST
US vs Iran
X

US vs Iran 

US vs Iran : మిడిల్ ఈస్ట్ రీజియన్ లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. శుక్రవారం నాడు అమెరికా రక్షణ దళాలు ఇరాన్ దేశంలోని మిసైల్ లాంచ్ ప్యాడ్‌లు, డ్రోన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు జరిపాయి. అంతర్జాతీయ జలాల్లో సరుకు రవాణా చేసే కార్గో నౌకపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడికి ప్రతికారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇరాన్ చర్యలు అంతర్జాతీయ సీజ్‌ఫైర్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని మండిపడ్డారు.

అమెరికా సెంట్రల్ కమాండ్ ఆపరేషన్

అమెరికా సైన్యానికి చెందిన రక్షణ విభాగం యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించింది. ఇరాన్ తీర ప్రాంతాల్లో ఉన్న రక్షణ రాడార్ వ్యవస్థలతో పాటు, సముద్ర నౌకలపై దాడులు చేయడానికి ఉపయోగించే డ్రోన్, క్షిపణి కేంద్రాలను తమ వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ దాడులకు కొద్దిసేపటి ముందే వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడుతూ.. ఇరాన్ దాడికి అమెరికా ఎలా సమాధానం చెప్పబోతోందో మీకు త్వరలోనే తెలుస్తుందని హెచ్చరించడం గమనార్హం.

ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలోనే ఆపేసిన ట్రంప్

వైట్ హౌస్ లో ఈ సంచలన మిలిటరీ ఆపరేషన్ జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సమయంలో.. ఇరాన్ నాలుగు సార్లు అంతర్జాతీయ నౌకలపై దాడులకు తెగబడటం తనకు నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఒకవైపు టెహ్రాన్ తో దౌత్యపరమైన శాంతి చర్చలు బాగానే సాగుతున్నాయని చెబుతూ, మరోవైపు ఇరాన్ ఎందుకు దాడులు చేస్తోందని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ట్రంప్ "వారు కొంచెం భిన్నమైన మనస్తత్వం కలవారు" అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ ను మధ్యలోనే నిలిపివేసి, జర్నలిస్టులను తన ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

ఒమన్ తీరంలో కార్గో షిప్‌పై దాడి

బ్రిటిష్ మిలిటరీ, యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఒమన్ తీరానికి సమీపంలో అంతర్జాతీయ సరుకు రవాణా చేస్తున్న ఒక భారీ కంటైనర్ నౌకపై అనుమానాస్పద డ్రోన్ దాడి జరిగినట్లు ధృవీకరించాయి. తమ సముద్ర మార్గాల్లో ఇతర దేశాల నౌకలు ప్రయాణించకూడదని ఇరాన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. అయితే ఈ ఘటనలో నౌకకు నష్టం వాటిల్లినప్పటికీ, సిబ్బందిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రక్షణ సంస్థలు తెలిపాయి.

యూఎన్ఓ సహాయక చర్యలకు బ్రేక్

ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థ (IMO) ఈ వారంలో హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన అంతర్జాతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఒక ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్ దాడుల నుండి రక్షించుకోవడానికి నౌకలు సాధారణ మార్గంలో కాకుండా ఒమన్ తీరం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అయితే తాజా కార్గో షిప్ దాడి నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి ఈ రెస్క్యూ ఆపరేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇతర నౌకలపై దాడులు జరగవనే పూర్తి గ్యారెంటీ లభించే వరకు సహాయక చర్యలను పునఃప్రారంభించబోమని ఐఎంఓ చీఫ్ ఆర్సేనియో డొమింగ్వెజ్ స్పష్టం చేశారు.

గ్లోబల్ ట్రేడ్ పై తీవ్ర ప్రభావం

సముద్ర రవాణా విశ్లేషకుల ప్రకారం.. తాజా దాడుల కారణంగా అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలపై తీవ్ర ప్రభావం పడింది. గడిచిన కొద్ది రోజుల్లో ఐక్యరాజ్యసమితి సుమారు 115 నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగింది. కానీ ఇప్పటికీ దాదాపు 500 కి పైగా సరుకు రవాణా, ముడి చమురు ట్యాంకర్లు ఆ ప్రాంతంలోనే చిక్కుకుపోయాయి. అమెరికా, ఇరాన్ ల మధ్య ఇంధన ఎగుమతులు, యురేనియం నిల్వలపై 60 రోజుల గడువుతో శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం వల్ల ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో చూడాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story