Pakistan : పాకిస్థాన్లో కొత్త ఉగ్ర ముఠా.. ఏడాది పాటు ప్రచారం చేసి 15 మంది ప్రాణాలు తీశారు
Pakistan : పాకిస్థాన్లో కొత్తగా పుట్టుకొచ్చిన ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ బన్నూలో 15 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. ఏడాది పాటు ప్రచారం చేసిన ఈ ముఠా ఇప్పుడు పాక్లో అలజడి సృష్టిస్తోంది.
Pakistan
Pakistan : పాకిస్థాన్ను ఉగ్రవాద భూతం మళ్లీ పట్టిపీడిస్తోంది. ఇప్పటికే తెహ్రీక్-ఎ-తాలిబన్ (TTP), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడులతో వణికిపోతున్న పాక్లో ఇప్పుడు ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్ అనే సరికొత్త ఉగ్రవాద సంస్థ కోరలు చాచింది. గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకుంటూ ప్రచారం చేసుకున్న ఈ సంస్థ, ఆదివారం బన్నూ ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడింది. పాకిస్థాన్ సైన్యం గట్టి పట్టు ఉందని చెప్పుకునే బన్నూలో ఆత్మహుతి దాడికి పాల్పడి ఏకంగా 15 మంది సైనికులను పొట్టనబెట్టుకుంది. ఈ ఏడాది పాక్ ప్రభుత్వంపై జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడి ఇదే కావడం గమనార్హం.
ఈ ఉగ్రవాద సంస్థ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. 2025 ఏప్రిల్ 11న మూడు చిన్న ఉగ్రవాద బృందాలు ఏకమై ఈ ఇత్తిహాద్-ఉల్-ముజాహిదీన్ను ఏర్పాటు చేశాయి. ఇస్లామిక్ క్రాంతి, లష్కరే ఇస్లాం, హాఫీజ్ గుల్ బహదూర్ గ్రూపులు కలిసి ఈ కూటమిగా మారాయి. ఒకప్పుడు పాక్ ప్రభుత్వం ఎవరినైతే మంచి తాలిబన్ అని పిలిచిందో, వారే ఇప్పుడు ఈ ముఠాలో కీలకంగా మారడం గమనార్హం. ఈ సంస్థకు ప్రత్యేకంగా ఒక నాయకుడు అంటూ ఎవరూ లేరు. సైన్యం జరిపే ఆపరేషన్ల నుంచి తప్పించుకోవడానికి వీరు కమాండర్ లేని వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మెహమూదుల్ హసన్ అనే వ్యక్తి ఈ ముఠాకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది కాలంగా ఈ ఉగ్రవాద సంస్థ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైందని అందరూ అనుకున్నారు. టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో పష్టో, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో పోస్టులు పెడుతూ, మిలిటరీ స్థావరాలను ఎలా పేల్చివేయాలో వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది. అయితే అది కేవలం ప్రచారం మాత్రమే కాదు, ఈ భారీ దాడికి రిహార్సల్ అని బన్నూ ఘటనతో తేలిపోయింది. అఫ్గానిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని వీరు కార్యకలాపాలు సాగిస్తున్నారు. టీటీపీ (TTP) దాడులు కాస్త తగ్గడంతో, ఇప్పుడు ఈ కొత్త సంస్థ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది.
ఈ ఘోరకలికి అఫ్గానిస్థాన్ కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ ప్రమేయంతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పాక్ విదేశాంగ శాఖ మండిపడుతోంది. అఫ్గాన్ సరిహద్దుల గుండా ఉగ్రవాదులు చొరబడుతున్నారని, వారికి అక్కడ ఆశ్రయం లభిస్తోందని పాక్ వాదిస్తోంది. అయితే ఈ ఆరోపణలను అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ఈ ఉగ్రవాద సంస్థను కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నప్పటికీ, దేశంలో అంతర్గత భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బన్నూ లాంటి సున్నితమైన ప్రాంతంలో ఇంత పెద్ద దాడి జరగడం పాక్ భద్రతా వైఫల్యానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.




