Nepal Flood: ప్రకృతి ప్రకోపానికి 392 మంది బలి.. 1500 మంది గల్లంతు.. పొంచి ఉన్న మరో ప్రమాదం
Nepal Flood: నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన అకస్మాత్తు హిమపాతం మహా జలప్రళయంగా మారింది.
Nepal Flood
Nepal Flood: నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన అకస్మాత్తు హిమపాతం మహా జలప్రళయంగా మారింది. ఊహించని ఈ ప్రకృతి ప్రకోపానికి దాదాపు 392 మంది ప్రాణాలు కోల్పోగా, 1500 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 290 మంది భారతీయ పర్యాటకులు ఉండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మంచు కొండలు ఉన్నట్టుండి పగిలిపోవడంతో భారీగా రాళ్ళు, బంకమట్టి, కొండచరియలు ఉధృతంగా కొట్టుకొచ్చాయి. బుధవారం ప్రారంభమైన ఈ జలప్రళయం తీవ్రతకు మధ్య నేపాల్ ప్రాంతంలోని అనేక చిన్న చిన్న గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. నిమిషాల వ్యవధిలోనే ఇళ్ళు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు నేపాల్లోనే 389 మంది ప్రాణాలు కోల్పోగా, టిబెట్లో ముగ్గురు మరణించారు. దాదాపు 1600 మందికి పైగా సహాయక సిబ్బంది హెలికాప్టర్లు, దళాల ద్వారా 1500 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కేంద్రం యుద్ధప్రాతిపదిక చర్యలు
మహా విపత్తులో చిక్కుకున్న భారతీయ పర్యాటకుల ఆచూకీ కనుగొనడానికి కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు 290 మంది భారతీయులు ఇప్పటికీ లభ్యం కాకపోవడంతో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఖాట్మాండు, బీజింగ్ రాయబారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది కార్మికులు, తమిళనాడుకు చెందిన 21 మంది పర్యాటకులతో సహా మొత్తం 84 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. టిబెట్ వైపు చిక్కుకున్న మరో 200 మంది భారత పర్యాటకులు రక్షణ కోసం ఎదురుచూస్తున్నారు.
పొంచి ఉన్న మరో విపత్తు
మొదటి ప్రమాదం నుంచి తేరుకోకముందే సరిహద్దుల్లోని ఛోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల కలయిక వద్ద ఒక కొత్త కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఇందులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరిందని, రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు. ఈ సహజ ఆకృతి గనుక పగిలిపోతే భోటేకోశి నదీ పరివాహక ప్రాంతాలు మళ్ళీ తీవ్ర ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. స్థానిక అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు.
కొట్టుకుపోయిన వంతెనలు
వరద తీవ్రతకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు ధ్వంసమవ్వగా, 80కి పైగా వంతెనలు కొట్టుకుపోయాయి. దీనివల్ల బాధితులకు సహాయం అందించడం సైన్యానికి సవాలుగా మారింది. శవపరీక్షల కోసం ఆస్పత్రులకు తీసుకొస్తున్న మృతదేహాలతో శవాగారాలు నిండిపోయాయి. ఈ కష్టసమయంలో నేపాల్కు భారత్ కొండంత అండగా నిలిచింది. ఇప్పటికే భారత వైమానిక దళం ద్వారా 47.5 టన్నుల ఆహారం, మందులు, అత్యవసర సహాయక సామగ్రిని నేపాల్కి అందజేశారు.




