LPG Ships: గల్ఫ్ నుంచి మరో రెండు గ్యాస్ నౌకలు.. ఒక ఆయిల్ నౌక!
LPG Ships: గల్ఫ్ నుంచి మరో రెండు గ్యాస్ నౌకలు, ఒక ఆయిల్ నౌక భారత్ కు రానున్నాయి. ఇప్పటికే ఇవి క్లిష్టమైన హార్ముజ్ జలసంధిని దాటినట్లు సమాచారం
LPG Ships
LPG Ships: భారత్ కు గ్యాస్ కష్టాలు తప్పినట్టే అనిపిస్తోంది. ఇప్పటికే పలు మార్గాల ద్వారా ఎల్పీజీ నౌకలు భారత్ కు చేరుకున్నాయి. క్లిష్ట సమయంలో కూడా ఎల్ఫీజీని తెచ్చుకోవడంలో భారత్ సమన్వయంతో వ్యవహరిస్తోంది. దీంతో వరుసగా చమురు, ఎల్పీజీ నౌకలు భారత్ తీరానికి వస్తున్నాయి.
తాజాగా యూఏఈకి , సౌదీ అరేబియాకు చెందిన రెండు ఎల్ఫీజి, ఒక ముడి చమురు నౌకలు భారత ఓడరేవులకు బయలుదేరినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతి ఇవ్వడంతో, ఎంవీ జగ్ వసంత్, ఎంవీ పైన్ గ్యాస్ అనే ఈ నౌకలు యూఏఈ ఓడరేవుల నుంచి బయలుదేరాయి.
92,612.59 మెట్రిక్ టన్నుల ఎల్పిజిని తీసుకువెళ్తున్న రెండు నౌకలు సోమవారం సాయంత్రం హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక నౌకలో 33 మంది సిబ్బంది ఉండగా, రెండవ నౌకలో 27 మంది ఉన్నారు. 'జగ్ వసంత్' నౌక మార్చి 26న కాండ్లా పోర్టుకు చేరుకుంటుంది.
పైన్ గ్యాస్ మార్చి 28న న్యూ మంగళూరుకు చేరుకుంటుంది. భారతదేశ పశ్చిమ తీరంలోని ఓడరేవులకు దాని ప్రయాణంలో, ఒమన్ గల్ఫ్లో భారత నావికాదళ యుద్ధనౌకలు 24 గంటల పాటు దీనికి రక్షణగా ఉంటాయి. అంతకుముందు, ఎల్పిజితో కూడిన ఎమ్.టి. శివాలిక్, ఎమ్.టి. నందా దేవి నౌకలు భారత తీరానికి సురక్షితంగా చేరుకున్నాయి. శివాలిక్ మార్చి 16న గుజరాత్లోని ముంద్రాకు చేరుకోగా, మరో ఎల్పిజి ట్యాంకర్ నందా దేవి మార్చి 17న గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంది.
పారాదీప్ పోర్ట్కు
సౌదీ అరేబియాలోని యాన్బు ఓడరేవు నుంచి బయలుదేరిన ఎం.టి. కలిస్తా మంగళవారం భారతదేశంలోని పారాదీప్ ఓడరేవుకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ నౌకకు భారత నావికాదళ నౌకలు కూడా రక్షణగా రానున్నాయి.
సంఘర్షణ ప్రాంతంలోని ట్యాంకర్లలోని భారత సిబ్బంది నిరంతర క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సమాచారం. సిబ్బంది ఒత్తిడిని తగ్గించడానికి భారత నౌకాదళం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకకు ఇరాన్ 2 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తోందన్న వార్తలను భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది.
మొత్తమ్మీద చూసుకుంటే, సంక్షోభ సమయంలోనూ గ్యాస్, చమురు నౌకలను సురక్షితంగా భారత్ రప్పించుకోవడం భారత ప్రభుత్వ సంకల్ప బలాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.




