Spain Migrant Crisis: స్పెయిన్లో వలస సంక్షోభం...ఇటలీ సంచలన నిర్ణయం
యూరప్ చరిత్రలోనే అతిపెద్ద శరణార్థుల సంక్షోభాన్ని స్పెయిన్ ఎదుర్కొంటోంది. 24 గంటల్లో 60 వేల మంది స్పెయిన్లోకి అక్రమంగా ప్రవేశించడంతో ఈ సంక్షోభం నెలకొంది. దీంతో ఇటలీ సరిహద్దులు మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
Spain Migrant Crisis: యూరప్ చరిత్రలోనే కనివినీ ఎరుగని అతిపెద్ద శరణార్థుల సంక్షోభం... 24 గంటల్లో 60 వేలమంది చొరబాటు. స్పెయిన్లో తలెత్తిన చిచ్చుతో సరిహద్దులు మూసివేసిన ఇటలీ. షెంగెన్ ఒప్పందానికి గండి. మానవ అక్రమ రవాణాదారుల కుట్రకు దాదాపు 41 మంది బలి. అసలు మొరాకో...స్పెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది. తెలుసుకుందాం.
ఆఫ్రికా ఖండంలో స్పెయిన్ ఆధీనంలో ఉన్న సెయుటా సరిహద్దుల వద్ద శరణార్థుల ప్రవాహం ఉప్పెనలా ముంచెత్తింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 50,000 నుండి 60,000 మందికి పైగా వలసదారులు మొరాకో సరిహద్దులు దాటి సెయుటాలోకి ప్రవేశించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంతో సరిహద్దు రక్షణ వ్యవస్థ సంపూర్ణంగా కుప్పకూలడమే కాకుండా, కనీసం 41 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ పరిణామం యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన, భద్రతాపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
శరణార్థుల ఉప్పెన ... సరిహద్దుల్లో ఉద్రిక్తత
స్పెయిన్కు చెందిన ఈ చిన్న భూభాగంలో సాధారణ జనాభా కంటే ఒక్కరోజులో వచ్చిన వలసదారుల సంఖ్య 70 శాతానికి పైగా ఉండటంతో నగరంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఆఫ్రికా తీరం నుంచి ఈదుకుంటూ, కాపలా గోడలను దాటుకుంటూ వేలాది మంది స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించారు. రిసెప్షన్ సెంటర్లు నిండిపోవడంతో వేలాది మంది వీధులు, పార్కులు, పుట్పాత్లపైనే గడపాల్సి వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 25,000 మంది తిరిగి మొరాకోకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ స్వయంగా సెయుటాను సందర్శించారు. సైనిక వాహనాలను రంగంలోకి దించడమే కాకుండా, మొరాకో భద్రతా దళాలు బాష్పవాయువు, నీటి ఫిరంగులను ఉపయోగించి గుంపులను అదుపు చేసే ప్రయత్నం చేశాయి.
ఇటలీ సంచలన నిర్ణయం ... షెంగెన్ ఒప్పందం రద్దు!
స్పెయిన్ సరిహద్దుల్లో తలెత్తిన ఈ తీవ్ర సంక్షోభం దృష్ట్యా ఇటలీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. తమ దేశ రక్షణను పునఃసమీక్షించుకుంటూ స్పెయిన్తో ఉన్న షెంగెన్ రహిత సరిహద్దు ఒప్పందాన్ని ఒక నెల రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం, స్పెయిన్ నుంచి విమానాలు లేదా నౌకల ద్వారా ఇటలీకి వచ్చే నాన్-ఈయూ పౌరులపై కఠినమైన తనిఖీలు నిర్వహిస్తారు. అయితే యూరోపియన్ యూనియన్ పౌరుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రోమ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటలీలో నెలకొన్న అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు, సరిహద్దు భద్రతా భయాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
ఈ హఠాత్తు చొరబాటుకు అసలు కారణమేమిటి?
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కథనం ప్రకారం... ఇటీవల స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును మానవ అక్రమ రవాణాదారులు తప్పుగా చిత్రీకరించారు. సముద్రం ద్వారా సెయుటాకు చేరుకుంటే స్పెయిన్ లోపలికి ప్రవేశం సులువవుతుందని తప్పుడు ప్రచారం చేసి, వేలాది మంది యువకులను, కుటుంబాలను ప్రమాదంలోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి చోటుచేసుకున్న ఈ భారీ వలసల సంక్షోభం ఐరోపా సరిహద్దు భద్రతా విధానాలకు సరికొత్త సవాలుగా మారింది.




