Iran War: అజ్ఞాతంలో ఖమేనీ.. అధికారం మొత్తం సైనిక జనరల్స్ చేతుల్లోకి..!

Iran War: పశ్చిమాసియా రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా కుదిపేసే సంచలన వార్తను అంతర్జాతీయ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్

G Krishna
Published on: 24 April 2026 11:32 AM IST
mojtaba khamenei
X

mojtaba khamenei

Iran War: పశ్చిమాసియా రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా కుదిపేసే సంచలన వార్తను అంతర్జాతీయ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణించారంటూ గతంలో వచ్చిన ఊహాగానాలకు తెరదించుతూనే, ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత గడ్డు పరిస్థితులను ప్రపంచం ముందు ఉంచింది. ఆయన బతికే ఉన్నారని, స్పృహలోనే ఉన్నారని స్పష్టం చేసిన ఈ కథనం.. ఒక భారీ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అజ్ఞాతంలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. అయితే ఈ అజ్ఞాతం కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ఇరాన్ అధికార యంత్రాంగంలో పెను మార్పులకు నాంది పలికిందని ఈ నివేదిక సారాంశం.

గాయాలతో రహస్య పోరాటం..

పత్రిక కథనం ప్రకారం మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం శారీరకంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేకపోయినప్పటికీ, ఆ దాడి తాలూకు ఆనవాళ్లు ఆయన శరీరాన్ని ఛిద్రం చేశాయి. ముఖ్యంగా ఆయన కాలికి ఇప్పటికే మూడుసార్లు శస్త్రచికిత్సలు జరిగాయని, ప్రస్తుతం ఆయన కృత్రిమ కాలు (Prosthetic leg) అమర్చుకునే ప్రక్రియ కోసం వేచి చూస్తున్నారని సమాచారం. కేవలం కాలు మాత్రమే కాకుండా, ఒక చేతికి కూడా సర్జరీ జరిగిందని, అది కోలుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. అన్నింటికంటే ప్రధానంగా, దాడిలో ఆయన ముఖం , పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో కనీసం మాట్లాడటం కూడా ఆయనకు కష్టతరంగా మారింది. భవిష్యత్తులో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రూపురేఖలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. తన బలహీనమైన రూపాన్ని ప్రపంచానికి చూపించడం ఇష్టం లేకనే, తన ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం ఖమేనీ పూర్తిగా రహస్య జీవనం గడుపుతున్నారని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.

మధ్యయుగాల నాటి సమాచార వ్యవస్థ..

నేటి ఆధునిక డిజిటల్ యుగంలో కూడా ఇరాన్ అత్యున్నత నాయకత్వం ఇప్పుడు అత్యంత ప్రాచీన పద్ధతుల్లో సమాచారాన్ని మార్పిడి చేసుకుంటోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక నిఘా సాంకేతికత , 'పెగాసస్' వంటి సాఫ్ట్‌వేర్ల భయంతో ఖమేనీ ఎలక్ట్రానిక్ పరికరాలను ముట్టడమే మానేశారు. ఆయన ఇచ్చే ప్రతి ఆదేశం చేతితో రాసిన లేఖల రూపంలో, సీల్డ్ కవర్లలో పంపిణీ అవుతోంది. ఈ లేఖలను ఒక రహస్య మానవహారంలా కార్లు, మోటార్‌సైకిళ్లపై ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ అత్యంత పకడ్బందీగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా తమను గుర్తించి దాడి చేయొచ్చనే భయంతో ఇరాన్ సీనియర్ అధికారులు కూడా ఆయన్ను నేరుగా కలవడానికి సాహసించడం లేదు. దీనివల్ల సుప్రీం లీడర్ ఆదేశాలు అందడంలో జాప్యం జరుగుతుండటం, పాలనా పరమైన నిర్ణయాల్లో అనిశ్చితికి దారితీస్తోంది.

తెరపైకి సైనిక జనరల్స్..


ఖమేనీ కమ్యూనికేషన్ పరిమితం కావడం , ఆయన అజ్ఞాతంలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కమాండర్లు దేశంపై పూర్తి పట్టు సాధించారు. ప్రస్తుతం ఇరాన్‌లో యుద్ధం, దౌత్యం, , జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం పౌర ప్రభుత్వం నుంచి సైనిక జనరల్స్ చేతుల్లోకి మళ్లింది. "మొజ్తబా ఒక బోర్డు డైరెక్టర్‌లా కేవలం దిశానిర్దేశం చేస్తుంటే, జనరల్స్ బోర్డు సభ్యులుగా మారి వాస్తవ నిర్ణయాలను అమలు చేస్తున్నారు" అని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ సలహాదారు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిణామం వల్ల ప్రస్తుత దేశాధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ , విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వంటి నేతలు కేవలం దేశీయ వ్యవహారాలకే పరిమితమై, అంతర్జాతీయ వేదికలపై నామమాత్రంగా మారిపోయారు.

విఫలమవుతున్న దౌత్యం.. మిలిటరీదే అంతిమ నిర్ణయం


ఈ అధికార మార్పిడి వల్ల ఇరాన్ విదేశాంగ విధానంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాతో జరగాల్సిన కీలక చర్చలు సైనిక జనరల్స్ జోక్యం వల్లే విఫలమైనట్లు తెలుస్తోంది. అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగిస్తున్న సమయంలో ఎలాంటి చర్చలు జరపకూడదని మిలిటరీ కమాండర్లు భీష్మించుకు కూర్చోవడంతో, పౌర ప్రభుత్వం చేయాలనుకున్న దౌత్య ప్రయత్నాలు నీరుగారిపోయాయి. అధికారికంగా పాలనా వ్యవస్థ మారనప్పటికీ, వాస్తవంగా అధికారం మాత్రం ఒక వ్యక్తి నుంచి సైనిక కూటమి చేతికి బదిలీ అయిందని ఈ కథనం స్పష్టం చేస్తోంది. ఇరాన్ భవిష్యత్తు , ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తిగా ఈ సైనిక జనరల్స్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఖమేనీ ఎప్పుడు కోలుకుంటారు లేదా ఆయన వారసుడి ఎంపిక ఎలా జరుగుతుంది అనే విషయాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story