Strait of Hormuz Toll Iran: అమెరికా ఇచ్చిన ఐడియా...రోజుకు 15 వేల కోట్ల ఆదాయం పొందనున్న ఇరాన్
Strait of Hormuz Toll Iran: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు కొత్త ఆర్థిక చర్చలకు కేంద్రబిందువైంది.
Strait of Hormuz Toll Iran
Strait of Hormuz Toll Iran: ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు కొత్త ఆర్థిక చర్చలకు కేంద్రబిందువైంది. ఒక్కో నౌకపై టోల్ విధించడం ద్వారా రోజుకు సుమారు రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం పొందే అవకాశాన్ని ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే, గ్లోబల్ వాణిజ్య సమీకరణాలు మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
ఉద్రిక్తతల నుంచి ఆర్థిక స్థిరత్వంవైపు
అమెరికా–ఇరాన్ మధ్య దాదాపు 39 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులు కాల్పుల విరమణతో ముగిశాయి. అయితే ఈ ఘర్షణ ప్రభావం అంతటితో ముగియలేదు. యుద్ధ సమయంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను ప్రదర్శించడంతో ప్రపంచ మార్కెట్లలో కలకలం రేగింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం రవాణా అవుతుండటంతో, సరఫరా అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరిగాయి. ఉద్రిక్తతలకు పూర్వం ఆ జలసంధి గుండా సగటున సుమారు 90 నుంచి 100 వరకు వాణిజ్య నౌకలు ప్రయాణిస్తుండేవి. ప్రపంచంలోనే ఇది అత్యంత రద్దీ మార్గంగా చెబుతారు. ముఖ్యంగా చమురు ట్యాంకర్లు, ఎల్ఎన్జీ నౌకలు, వాణిజ్య సరుకు నౌకలు ఈ మార్గాన్ని ఆధారపడతాయి. రోజుకు సుమారు 17 నుంచి 21 మిలియన్ బ్యారెల్స్ చమురు ఈ జలసంధి గుండా వెళ్లడం దీనికి ఉన్న ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తుంది.
ఇలాంటి కీలక మార్గంపై టోల్ విధించే ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సరుకు పరిమాణం, విలువ ఆధారంగా ఒక్కో నౌకపై సుమారు 2 మిలియన్ డాలర్ల వరకు రుసుము విధించే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. ఈ లెక్క ప్రకారం రోజుకు గరిష్టంగా 180 నుంచి 200 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే నెలకు లక్షల కోట్లలో ఆదాయం వచ్చే అవకాశముంది.
అమెరికా పాత్ర
ఈ ఆలోచన వెనుక అమెరికా పాత్రపై కూడా చర్చ జరుగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్గంపై నియంత్రణ సాధించి అమెరికాకు ఆదాయం తీసుకురావాలనే వ్యూహాన్ని సూచించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ ఈ అవకాశాన్ని తనదైన ఆర్థిక వ్యూహంగా మలుచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఇరాన్ దృష్టిలో ఇది యుద్ధానంతర పునరుద్ధరణకు ఒక స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. యుద్ధంలో మౌలిక వసతులు దెబ్బతిన్నప్పటికీ, భవిష్యత్తులో నిరంతర ఆదాయం పొందే మార్గాన్ని ఏర్పరచుకోవడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్గా మారవచ్చు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దాంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది.
మొత్తంగా చూసుకుంటే, ఈ జలసంధిపై ఇరాన్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, ప్రపంచ వాణిజ్యానికి కూడా కీలకంగా మారబోతోంది. అమెరికా దీనిపై ఎలా స్పందిస్తుంది? ఇతర దేశాలు దీనిని అంగీకరిస్తాయా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.


