Indonesia Wildfires: చల్లారని మంటలు... ఇండోనేషియానూ దహించివేస్తోంది
ఇండోనేషియాను మంటలు దహించివేస్తున్నాయి. దేశంలోని ఆరు ప్రధాన ప్రాంతాలను అగ్ని కీలలు చుట్టుముట్టాయి. ఇండోనేషియాలో మొదలైన దావనలం కారణంగా సరిహద్దు దేశమైన మలేషియాను పొగ కమ్మేసింది.
Indonesia Wildfires: ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాను తీవ్రమైన అటవీ అగ్నిప్రమాదాలు దహించివేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 1,07,000 హెక్టార్లకు పైగా భూభాగం, బొగ్గు నేలలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అత్యంత శక్తివంతమైన 'గాడ్జిల్లా ఎల్ నినో' ప్రభావం వల్ల ఈ ఏడాది ఎండల తీవ్రత పెరిగి, వాతావరణం పొడిబారడంతో మంటలు కంట్రోల్ తప్పాయి. దట్టమైన పొగ మరియు విషవాయువులు అలుముకోవడంతో అనేక ప్రావిన్సుల్లో పాఠశాలలకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించి, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా క్లౌడ్-సీడింగ్ చేపట్టి కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రధాన ప్రాంతాలపై కార్చిచ్చు దెబ్బ... భయపెడుతున్న గణాంకాలు
ఇండోనేషియా అధికారులు ముఖ్యంగా విస్తారమైన బొగ్గు నేలలు కలిగిన ఆరు ప్రధాన ప్రావిన్సులపై దృష్టి సారించారు. జాంబి, దక్షిణ సుమత్రా, పశ్చిమ కాళిమంతన్, మధ్య కాళిమంతన్, దక్షిణ కాళిమంతన్, రియావు ప్రాంతాల్లో మంటలు తీవ్రంగా ఉన్నాయి. మధ్య కాళిమంతన్లోని పలాంగ్క రాయా నగరంలో నెల రోజులుగా దట్టమైన పొగ అలుముకుంది. నీటి వనరులు ఇంకిపోవడంతో మంటలు ఆర్పడం కష్టంగా మారిందని, ఇళ్ల సమీపానికి మంటలు రావడంతో కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అంతేకాదు, తూర్పు జావాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన మౌంట్ బ్రోమో నేషనల్ పార్క్లో వారం రోజులుగా రగిలిన మంటల్లో 550 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలిపోయింది. అగ్నిపర్వతం సమీపంలో కొత్తగా మంటలు చెలరేగడంతో ఆగస్టు 8 నుంచి ఈ పార్కును సందర్శకులకు మూసివేశారు. ఎవరో చేసిన చిన్న నిర్లక్ష్యమే ఈ పెద్ద అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మలేషియాను కమ్మేసిన పొగ
ఇండోనేషియా నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ సరిహద్దులు దాటి పొరుగున ఉన్న మలేషియాకూ పాకింది. మలేషియాలోని సరవాక్ రాష్ట్రంలో వాయు కాలుష్య సూచీ దారుణంగా పడిపోయింది. శనివారం నాటికి సీరియన్ పట్టణంలో వాయు కాలుష్య సూచీ ఏకంగా 195 ప్రమాదకర రికార్డును నమోదు చేసింది. సాధారణంగా ఏపీఐ 101 నుండి 200 ఉంటే అనారోగ్యకరమైనదిగానూ, 201 దాటితే తీవ్ర ప్రమాదకరంగానూ పరిగణిస్తారు. సరవాక్ వ్యాప్తంగా కనీసం 9 ప్రాంతాల్లో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం తగ్గకపోతే ఈ కార్చిచ్చు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.




