Oil Prices: హోర్ముజ్‌ ఎఫెక్ట్... 2027లో భారీగా పెరగనున్న చమురు ధరలు

యుద్ధ ప్రభావం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. హోర్మూజ్‌ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా 20 శాతం ఆయిల్‌ రవాణా స్తభించిపోయింది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Balachander
Published on: 20 July 2026 11:03 AM IST
Oil Prices: హోర్ముజ్‌ ఎఫెక్ట్... 2027లో భారీగా పెరగనున్న చమురు ధరలు
X

Oil Prices: మధ్యప్రాచ్యంలో మళ్లీ చెలరేగిన సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన రంగాన్ని, అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒకేసారి తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నావికాదిగ్బంధనం విధించడంతో చమురు ధరలు ఒకేసారి 8 శాతానికి పైగా పెరిగాయి. ఈ హఠాత్ పరిణామం వల్ల పెరిగే ద్రవ్యోల్బణం, 2027 నాటికి అమెరికాలోని కోట్లాది మంది పింఛనుదారులకు దక్కే సోషల్ సెక్యూరిటీ 'జీవన వ్యయ సర్దుబాటు' పెంపుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.

హోర్ముజ్ ఉద్రిక్తతలు ... చమురు మార్కెట్లో ప్రకంపనలు

జూన్ నెల నాటి కాల్పుల విరమణ విఫలమయ్యాక వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోతుందనే భయాందోళనలు గ్లోబల్ మార్కెట్‌ను చుట్టుముట్టాయి. మునుపటి చమురు సంక్షోభాల సమయంలో అమెరికా తన 'వ్యూహాత్మక చమురు నిల్వల'ను మార్కెట్లోకి విడుదల చేసేది. కానీ ప్రస్తుతం ఈ నిల్వలు 1983 నాటి అత్యల్ప స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చమురు భారం పెరిగితే కేవలం పెట్రోలు మాత్రమే కాకుండా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు కూడా భారమవుతాయి.

2027 'కోలా' పెంపు అంచనాలు

అమెరికా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల 'వినియోగదారుల ధరల సూచీ' సగటు ఆధారంగా ప్రతి ఏటా ఈ పెంపును లెక్కిస్తుంది. చమురు ధరలు పెరిగిన సమయంలోనే ఈ లెక్కింపు ప్రక్రియ జరగడం గమనార్హం. 2026లో లబ్ధిదారులకు 2.8% పెంపు దక్కగా, ప్రస్తుత ద్రవ్యోల్బణ తీవ్రత వల్ల 2027 నాటికి ఇది 3.8% స్థాయికి చేరుకోవచ్చని ది సీనియర్ సిటిజన్స్ లీగ్ అంచనా వేసింది. ఒకవేళ ఈ అంచనా నిజమైతే, గత 10 సంవత్సరాలలో ఇది మూడో అత్యధిక పెంపు కానుంది. అయితే, అధికారిక పెంపు వివరాలను సోషల్ సెక్యూరిటీ సంస్థ అక్టోబర్ 14న ప్రకటించనుంది. పింఛను మొత్తం పెరిగినప్పటికీ, ద్రవ్యోల్బణం వల్ల పెరిగే ధరల కారణంగా సామాన్య లబ్ధిదారులకు లభించే నికర కొనుగోలు శక్తి పెద్దగా మారకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధరలు పెరగబోతున్నాయని ముందుగానే తెలియడంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. ఈ భారం ఒక్క అమెరికాపై మాత్రమే కాదు... ప్రపంచంలోని చాలా దేశాలపై కూడా ఉండే అవకాశం లేకపోలేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story