Donald Trump: యుద్ధం గెలిచాం అంటున్న ట్రంప్.. అదేం లేదంటున్న ఇరాన్!
Donald Trump: అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించి.. మేమే గెలిచాం అంటున్నారు. మరోవైపు ఇరాన్ అసలు చర్చలే జరగలేదంటోంది.
Donald Trump
Donald Trump: అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తెలిపారు. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఇరాన్ ఒక ఒప్పందాన్ని కోరుకుంటోందని ట్రంప్ అన్నారు. "ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదన్నదే మా మొదటి షరతు. దీనిపై ఇప్పటికే అంగీకారం కుదిరింది" అని ఆయన చెప్పారు.
అమెరికా యుద్ధంలో గెలిచిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు పనికిరాకుండా పోయాయని ఆయన అన్నారు. అమెరికా విమానాలు టెహ్రాన్ మీదుగా చక్కర్లు కొడుతున్నాయి. చర్చలు విఫలమైతే, అమెరికా తనకు నచ్చినది ఏదైనా చేయగలదని ఆయన అన్నారు.
అయితే, ఇరాన్ ఇప్పటివరకు అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలో జరగలేదని చెబుతోంది. మరోవైపు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇరాన్పై దాడులను కొనసాగించమని ట్రంప్ను కోరారని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.
ఐదు రోజులు విరామం..
అమెరికా, ఇరాన్ల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో 15 అంశాలపై ఒప్పందం కుదిరిందని ట్రంప్ చెప్పారు. ఈ అంశాల పూర్తి లిస్ట్ బయట పెట్టలేదు. హోర్ముజ్ జలసంధిని తెరవాలని గతంలో 48 గంటల హెచ్చరిక జారీ చేసిన ఆయన, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేశారు.
అదేం లేదు..ఇరాన్
టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీలతో కలిసి ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినట్లు పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ లో కథనం వెలువడింది.
దాడులు ఆగలేదు..
ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
- సౌదీ అరేబియా బాలిస్టిక్ క్షిపణి, 6 డ్రోన్లను కూల్చివేసింది. తూర్పు ప్రావిన్స్లో తమ వాయు రక్షణ వ్యవస్థ ఒక బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..గత గంటలో అదే ప్రాంతంలో కనీసం ఆరు డ్రోన్లను కూడా కూల్చివేశారు.
- లెబనాన్ నుండి అందిన ఇజ్రాయెల్ మీడియా కథనం ప్రకారం, ఉత్తర ఇజ్రాయెల్లోని కిరియత్ ష్మోనా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రాకెట్ దాడి జరిగిన తర్వాత వైమానిక దాడి సైరన్లు మోగాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఈ దాడిలో నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్ దాడి అనంతరం ఇంధన ట్యాంకుకు మంటలు అంటుకున్నాయని కువైట్ పౌర విమానయాన సంస్థ ధృవీకరించింది.
- అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ ప్రకారం, ప్రాథమిక సమాచారం మేరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు మరియు ఆస్తి నష్టం మాత్రమే పరిమితమైంది.
- ఘటన జరిగిన వెంటనే అత్యవసర నిబంధనలను అమలు చేశామని ఆయన అన్నారు. మంటలను ఆర్పివేయడానికి అగ్నిమాపక దళంతో సహా సంబంధిత ఏజెన్సీలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.




