China Travel Ban: చైనాలో మరో కొత్త రూల్... విదేశీ ప్రయాణంపై మూడేళ్ల బ్యాన్
చైనా పౌరుల విదేశీ ప్రయాణాలపై కొత్త ఆంక్షలు విధించింది. జాతీయ భద్రత లేదా ప్రయోజనాలకు ముప్పుగా భావించిన వారికి 3 ఏళ్ల వరకు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించవచ్చు.
China Travel Ban: చైనాలో పౌరుల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు మరింత కఠినమవుతున్నాయి. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినట్లు భావించే పౌరులను గరిష్ఠంగా మూడు సంవత్సరాల పాటు చైనా నుంచి బయటకు వెళ్లకుండా నిషేధించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అంతేకాదు.. పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పుగా పరిగణించే వ్యక్తులు, కార్యకలాపాలు కూడా ఈ నిబంధనల పరిధిలోకి రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. కొత్త నిబంధనల ప్రకారం, విదేశాల్లో ఉన్న సమయంలో చైనా జాతీయ భద్రత లేదా ప్రయోజనాలకు హాని కలిగించారని అధికారులు భావించినా, ఆ వ్యక్తి తిరిగి చైనాకు వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన సాధారణ నేరాలకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ సాంకేతిక, పారిశ్రామిక భద్రతకు సంబంధించిన అంశాలకూ వర్తించేలా రూపొందించడం గమనార్హం.
టెక్నాలజీ రంగంపై ప్రత్యేక నిఘా
ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్యం కోసం పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలను బీజింగ్ అత్యంత వ్యూహాత్మకంగా చూస్తోంది. ఈ రంగాల్లో పనిచేసే కొంతమంది సంస్థల అధికారులు, ఉద్యోగుల విదేశీ ప్రయాణాలపై గతంలోనే ఆంక్షలు విధించినట్లు నివేదికలు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో మెటా కొనుగోలు చేసిన AI సంస్థ మానస్ సహ వ్యవస్థాపకులు చైనా విడిచి వెళ్లకుండా అడ్డుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా నిబంధనల నేపథ్యంలో ఇలాంటి చర్యలు ఇకపై మరింత విస్తృతంగా అమలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
‘హైరిస్క్’ దేశాలకు వెళ్లొద్దని సూచన
కొత్త నిబంధనల్లో మరో అంశం కూడా ఉంది. విదేశాలకు వెళ్లే చైనా పౌరులు ‘అధిక ప్రమాదం’ ఉన్న దేశాలు, ప్రాంతాలకు వెళ్లకుండా సరిహద్దు అధికారులు సూచించాల్సి ఉంటుంది. అయితే ఏ దేశం లేదా ప్రాంతాన్ని ‘హైరిస్క్’గా పరిగణించాలనే విషయంలో ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉండటం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఇలాంటి ప్రయాణ నియంత్రణలు చైనాలో కొత్తవి కావు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి.
ఉద్యోగుల పాస్పోర్టులూ ప్రభుత్వ ఆధీనంలో
చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి చెప్పిన వివరాల ప్రకారం, సుమారు 2018లోనే అతని కార్యాలయంలో ఉద్యోగుల పాస్పోర్టులను అప్పగించాలని ఆదేశించారు. గత ఏడాది ఉద్యోగ విరమణ చేసినప్పటికీ, అతని పాస్పోర్టు ఇప్పటికీ మాజీ సంస్థ వద్దే ఉందని అతను తెలిపాడు. విదేశాలకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనే వివరాలు చెప్పి అనుమతి పొందాల్సి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. బంధువులను కలవడానికి చేసే ప్రయాణాలకు కొంత సానుకూలత ఉండేదని, కేవలం పర్యటన కోసం వెళ్లే అభ్యర్థనలకు అంతగా అనుమతి లభించేది కాదని చెప్పారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు దేశం విడిచి పారిపోకుండా చూడటం, విదేశాలకు ఆస్తులు తరలించకుండా నిరోధించడం వంటి కారణాలతో ఈ నియంత్రణలు తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉన్నత స్థాయి అధికారుల విషయంలో ప్రభుత్వ రహస్యాలు బయటకు వెళ్లకుండా చూడటం కూడా మరో ఉద్దేశంగా ఉండవచ్చని తెలిపారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
చైనా పౌరులపై ఎగ్జిట్ బ్యాన్లు ఎంతగా పెరిగాయో కొన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థ సేఫ్గార్డ్ డిఫెండర్స్ అందించిన సమాచారాన్ని బట్టి, చైనా సుప్రీంకోర్టు డేటాబేస్లో 2016లో ఎగ్జిట్ బ్యాన్లకు సంబంధించిన రికార్డులు కేవలం 89 మాత్రమే ఉన్నాయి. అదే సంఖ్య 2025 నాటికి 1,88,760కు పెరిగింది. అంటే తొమ్మిదేళ్ల వ్యవధిలో భారీ స్థాయిలో పెరుగుదల నమోదైంది. అలాగే 2019లో ఎగ్జిట్ బ్యాన్లకు సంబంధించిన కేసులు మొత్తం సివిల్ తీర్పుల్లో సుమారు 0.23 శాతం ఉండగా, 2025 నాటికి ఈ వాటా 7.3 శాతానికి చేరింది. అయితే కొన్ని తీర్పులు బహిరంగంగా అందుబాటులో లేకపోవడంతో అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
సాధారణ పౌరులకూ ఆందోళనేనా?
చైనా ప్రభుత్వం అనుకూల ‘రూమర్ రిఫ్యూటింగ్’ వేదిక పియావో మాత్రం కొత్త నిబంధనలు సాధారణ ప్రజల విదేశీ ప్రయాణాలను లక్ష్యంగా చేసుకున్నవి కావని పేర్కొంది. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లడం, మోసాలకు గురికావడం, విదేశాల్లో అక్రమ జూదం లేదా స్కామ్లకు పాల్పడటం వంటి సమస్యలను అరికట్టడమే ఉద్దేశమని తెలిపింది. అయితే మానవ హక్కుల కార్యకర్తలు, విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. మానవ హక్కులు, ప్రభుత్వ విధానాలపై విమర్శలు వంటి అంశాల్లో పనిచేసే వ్యక్తులపై కూడా ఈ నిబంధనలు ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంటున్నారు. జార్జ్టౌన్ యూనివర్సిటీకి చెందిన ఆసియా న్యాయ నిపుణుడు ప్రొఫెసర్ టామ్ కెల్లాగ్ ప్రకారం, విదేశాల్లో చైనా పౌరులు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనే విషయాలపై నియంత్రణ పెంచేందుకు ఇది మరో సాధనంగా మారవచ్చనే ఆందోళన ఉంది.
పాస్పోర్టు రాకపోతే కారణం కూడా తెలియకపోవచ్చు
చైనా పౌరులు తాము ఎగ్జిట్ కంట్రోల్ పరిధిలో ఉన్నామో లేదో స్వయంగా తెలుసుకునే అవకాశం పరిమితంగా ఉందని అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోంది. అధికారికంగా రాతపూర్వకంగా లేదా మౌఖికంగా సమాచారం ఇవ్వకపోతే, పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసినప్పుడు లేదా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలోనే అసలు విషయం తెలిసే పరిస్థితి ఉండొచ్చు. ఇక, 26 ఏళ్ల ‘పిపి’ అనే మారుపేరుతో మాట్లాడిన ఓ చైనా పౌరుడు 2023లో తన పాస్పోర్టు దరఖాస్తు తిరస్కరించారని తెలిపాడు. 2019 హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల నిరసనల్లో పాల్గొన్నందువల్లే ఇలా జరిగి ఉండవచ్చని అతను అనుమానిస్తున్నాడు. నిరసనల సమయంలో హాంకాంగ్ మీడియాతో మాట్లాడిన అతడిని చైనాకు తిరిగి వచ్చిన తర్వాత భద్రతా పోలీసులు ప్రశ్నించినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు అతని ముందున్న ప్రశ్న ఒక్కటే.. తాను ఎప్పటికైనా చైనా దాటి బయటకు వెళ్లగలనా? పౌరుల విదేశీ ప్రయాణాలపై పెరుగుతున్న నియంత్రణల మధ్య ఇలాంటి ప్రశ్నలు చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛ, జాతీయ భద్రత మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతకు అద్దం పడుతున్నాయి.




