Uppal: హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే బర్తరఫ్ చేయాలి: లక్ష్మారెడ్డి
Uppal: హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
Uppal: హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే బర్తరఫ్ చేయాలి: లక్ష్మారెడ్డి
ఉప్పల్:
Ashok.. KAPRA
హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని బట్టబయలు చేశాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ప్రజల ఇళ్లను కూల్చివేసే విషయంలో అపార అధికారాలు వినియోగించిన హైడ్రా, చట్టం ముందు మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. కోర్టు ఆదేశాలు, న్యాయపరమైన విధానాలను పట్టించుకోకుండా వ్యవహరించే అధికారులను ప్రభుత్వం వెనుకేసుకురావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని మండిపడ్డారు.
హైడ్రా పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలతో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం అనే విధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే హైడ్రా చర్యలు చట్ట పరిరక్షణ కోసం కాకుండా రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగపడుతున్నాయని హెచ్చరిస్తూ వచ్చిందని, ఇప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయని అన్నారు.
నైతిక బాధ్యత ఉన్న ఏ అధికారి అయినా ఇలాంటి పరిస్థితుల్లో పదవిలో కొనసాగకూడదని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏ.వి. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టు ధిక్కరణ కింద అనేక కేసులు నమోదు అయ్యాయి అని ఆయన అన్నారు.
అలాగే హైడ్రా పేరిట జరిగిన కూల్చివేతలు, ఎంపిక చేసిన చర్యలు, అధికార దుర్వినియోగంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా అహంకారపూరిత వైఖరిని విడనాడి, హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాసే విధానాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.




