Vanasthalipuram: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు కింద పడి టీచర్ మృతి
Vanasthalipuram: వనస్థలిపురం సాగర్ కాంప్లెక్స్ వద్ద స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రైవేట్ స్కూల్ టీచర్ భాగ్యలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది.
Vanasthalipuram: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు కింద పడి టీచర్ మృతి
Vanasthalipuram: వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో సాగర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. స్కూటీని వెనుక నుంచి స్కూల్ బస్సు ఢీకొట్టడంతో మహిళపై నుంచి బస్సు చక్రాలు వెళ్లిన ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.
సెప్టెంబర్ 3న సాయంత్రం 4.20 గంటల సమయంలో ఇంజాపూర్కు చెందిన అడతి భాగ్యలక్ష్మి (32) తన భర్త సురేందర్ (40), ఇద్దరు కుమార్తెలు దాక్షాయని (2), భవిజ్ఞ (1)తో కలిసి స్కూటీపై ఇంజాపూర్ నుంచి బీఎన్ రెడ్డి నగర్కు బయలుదేరారు.
లైఫ్కేర్ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు (TG 07 U 7698) వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాగ్యలక్ష్మిపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమెకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. భర్త, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు క్షతగాత్రులను తొలుత లైఫ్కేర్ ఆస్పత్రికి, అనంతరం కామినేని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 1.10 గంటలకు భాగ్యలక్ష్మి మృతి చెందింది.
మృతురాలి తండ్రి నర్సన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.




