Vikarabad: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం ఎస్ఎఫ్ఐ నేతల ఆగ్రహం!
Vikarabad: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, NTA రద్దు చేయాలని SFI డిమాండ్.
Vikarabad: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం ఎస్ఎఫ్ఐ నేతల ఆగ్రహం!
Vikarabad: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు దాడులను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, సంఘాల పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున బంద్లో పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆవేదనను అణచివేయడానికి పోలీసు దాడులకు పాల్పడటం అత్యంత అమానుషమని నాయకులు మండిపడ్డారు.
నీట్ పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలు, విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ఘటనలకు రాజకీయ, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తిని ఇప్పటికీ పదవిలో కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా విశ్వసనీయత కోల్పోయిన NTAను వెంటనే రద్దు చేసి, పారదర్శకమైన, విద్యార్థులకు న్యాయం చేసే ప్రవేశ పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే విద్యార్థుల డిమాండ్లపై స్పందించి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుండి తొలగించాలని, NTAను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తేజ జిల్లా కమిటీ సభ్యులు అనిల్ రాకేష్ దీపక్ ఆదిత్య సిరియాస్ రెహాన్ తదితర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




