Patancheru: వివాహేతర సంబంధమే కారణం.. భార్య, ప్రియుడు అరెస్ట్!
Patancheru: సైబరాబాద్ పరిధిలోని పటాన్చెరువులో ఆటో డ్రైవర్ శేఖర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Patancheru: వివాహేతర సంబంధమే కారణం.. భార్య, ప్రియుడు అరెస్ట్!
Patancheru: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధి లో శేఖర్ రాయిగల్ల హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులైన బైండ్ల నవీన్ (24), మృతుడి భార్య ప్రమీల (27) ను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఒక స్కూటీ, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లా చెందిన శేఖర్ పటాన్చెరువు పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో కుటుంబంతో నివసిస్తూ ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. పటాన్చెరువులో హోటల్ నడుపుతున్న నవీన్తో శేఖర్కు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలో నవీన్ శేఖర్ ఇంటికి వస్తూ పోతూ, అతని భార్య ప్రమీలతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్తా గత రెండేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ప్రమీల 7 నెలల గర్భవతి.
ఇటీవల ఈ విషయం శేఖర్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. శేఖర్ తన భార్యను వేధించడంతో పాటు, నవీన్ను కూడా హెచ్చరించాడు.
తన వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే ఉద్దేశంతో శేఖర్ను వదిలించుకోవాలని నవీన్ పథకం పన్నాడు. ఈ నెల 12వ తేదీన నవీన్ శేఖర్ను పటాన్చెరువులోని క్యాండిడస్ ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక భాగంలో ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత, నవీన్ అతడి తలపై పెద్ద బండరాయితో బాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఈ విషయాన్ని ప్రమీలకు ఫోన్ ద్వారా తెలియజేశాడు.
పటాన్చెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శేఖర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులు నవీన్, ప్రమీలను అరెస్ట్ చేశారు.




