Osmania University: ఒకే కుటుంబంలో ముగ్గురికి పీహెచ్డీ డాక్టరేట్లు
Osmania University: ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవంలో నల్గొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వేర్వేరు విభాగాల్లో పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు.
Osmania University: ఒకే కుటుంబంలో ముగ్గురికి పీహెచ్డీ డాక్టరేట్లు
ఉస్మానియా యూనివర్సిటీ: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డాక్టరేట్ పట్టాలు అందుకుని అరుదైన ఘనత సాధించారు. నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధికి చెందిన కుకుడాల ఆంజనేయులు, కుకుడాల హైమావతి, కుకుడాల బాలకృష్ణలు మంగళవారం హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు.
భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగారం చేతుల మీదుగా వారికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. కుకుడాల ఆంజనేయులు కామర్స్ విభాగంలో, కుకుడాల హైమావతి వృక్షశాస్త్రంలో, కుకుడాల బాలకృష్ణ సామాజిక శాస్త్రం (సోషియాలజీ)లో పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్ పొందారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ మొక్కవోని దీక్షతో ఉన్నత విద్యను అభ్యసించామని వారు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అత్యున్నత విద్యా పట్టా అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు ప్రస్తుతం ఆంజనేయులు హాలియా పట్టణంలోని శ్రీశ్లోక పాఠశాల ఛైర్మన్గా, హైమావతి అనుముల కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్గా, బాలకృష్ణ నల్గొండ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తమ పరిశోధనలకు నిరంతరం ప్రోత్సాహం అందించిన ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి పీహెచ్డీలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.




