Osmania University: ఓయూలో అధ్యాపకుల కొరతపై ఏబీవీపీ ఫైర్.. ప్రభుత్వంపై గెల్లు శేఖర్ విమర్శలు!

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఓయూ ఏబీవీపీ అధ్యక్షుడు గెల్లు శేఖర్ డిమాండ్.

HARISH, TARNAKA
Published on: 23 May 2026 12:07 PM IST
Osmania University
X

Osmania University: ఓయూలో అధ్యాపకుల కొరతపై ఏబీవీపీ ఫైర్.. ప్రభుత్వంపై గెల్లు శేఖర్ విమర్శలు!

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఓయూ ఏబీవీపీ అధ్యక్షుడు గెల్లు శేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిలో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదన్నారు. రెండు ప్రభుత్వాలు మారినా యూనివర్సిటీల అభివృద్ధి, అధ్యాపక నియామకాల విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.

ఇటీవల రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేపడతామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోందన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం సుమారు 1268 ప్రొఫెసర్ పోస్టులు ఉండగా ప్రస్తుతం కేవలం 312 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లతోనే యూనివర్సిటీ నడుస్తోందని పేర్కొన్నారు.అధ్యాపకుల కొరత కారణంగా పరిశోధన రంగం తీవ్రంగా దెబ్బతింటోందని, విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. అనేక విభాగాలు గెస్ట్ ఫ్యాకల్టీ ఆధారంగా నడుస్తుండటం వల్ల విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని గెల్లు శేఖర్ డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆలస్యం చేయకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story