Serilingampally: యుగపురుషుడితో ఆత్మీయ జ్ఞాపకాలు: ఎన్టీఆర్ జయంతి వేళ ఎమ్మెల్యే గాంధీ నివాళి!

Serilingampally: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 28 May 2026 11:19 AM IST
Serilingampally
X

Serilingampally: యుగపురుషుడితో ఆత్మీయ జ్ఞాపకాలు: ఎన్టీఆర్ జయంతి వేళ ఎమ్మెల్యే గాంధీ నివాళి!

Serilingampally: తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెబుతూ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు.. ప్రగతికి, పోరాటానికి ఒక సజీవ సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానాయకుడితో తనకున్న అనుబంధాన్ని శేరిలింగంపల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీ మీడియాతో పంచుకున్నారు. ఆయన స్ఫూర్తి, ఆశయాలే తన రాజకీయ ప్రస్థానానికి దిక్సూచి అంటూ ఆయన ప్రవేశపెట్టిన చారిత్రాత్మక సంస్కరణలను గాంధీ అత్యంత భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

శేరిలింగంప‌ల్లి: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావుతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ నెమరువేసుకున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులర్పించారు. రాజకీయాల్లో తనకు ఓనమాలు నేర్పిన ఆదర్శమూర్తి ఆయనేనని, ఆయన ఆశయాలు, విలువలే పునాదిగా నేడు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుపుతున్నట్లు తెలిపారు. ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, నేడు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నానంటే దానికి ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి, ఆయనతో సాగిన మధుర క్షణాలే కారణమని వెల్లడించారు.

రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటారనేలా కోట్లాది మంది హృదయాల్లో ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ రూపం అజరామరమని కొనియాడారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా, రాజకీయాల్లోకి ప్రవేశించి నిఖార్సయిన పేదల పక్షపాతిగా నిలిచారని స్పష్టం చేశారు. పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి బృహత్తర సామాజిక పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నతుడని శ్లాఘించారు. పరిపాలనా వికేంద్రీకరణకు అద్దం పడుతూ బ్రిటీష్ కాలం నాటి పాత తాలూకా వ్యవస్థను ధైర్యంగా రద్దు చేసి, మండల వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత ఆ మహానాయకుడిదేనని గుర్తుచేశారు. దీనితో పాటుగా, సమాజంలో సగభాగమైన మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆడపిల్లలకు సైతం వారసత్వ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చారిత్రాత్మక చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు. ఈ విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా గ్రామీణ ప్రజల చెంతకు చేర్చి, దేశవ్యాప్తంగా భారీ రాజకీయ, సామాజిక మార్పులకు నాంది పలికారని విశ్లేషించారు.

ఎన్టీఆర్ ఆశయాల వెల్లువలో ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన లక్షలాది మంది యువకుల్లో తాను ముందు వరుసలో ఉంటానని ఆరికెపూడి గాంధీ సగర్వంగా ప్రకటించారు. ఆ మహానుభావుడిని పలు దఫాలుగా ప్రత్యక్షంగా కలుసుకునే అరుదైన అదృష్టం తనకు దక్కిందని, ఆ తీపి గుర్తులు తన జీవితాంతం నిలిచిపోతాయని భావోద్వేగానికి లోనయ్యారు. అసలైన ప్రజా నాయకుడు ప్రజల మధ్య ఎలా ఉండాలి, వారి సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే అత్యున్నత విలువలను ఎన్టీఆర్ ను చూసే నేర్చుకున్నట్లు చెప్పారు. ఆ మహానాయకుడి నీడన రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, ఆయన అడుగుజాడల్లో నడవడం తన జీవితానికి దక్కిన అత్యంత అద్భుత వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ఆఖరి వ్యక్తి ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి, ఆయన ప్రతిష్ట అజరామరంగా వెలుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. నాడు యువతలో ఆయన నింపిన చైతన్యం, నేర్పిన రాజకీయ విలువలను నేటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఆశయాల బలమే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు తనకు కొండంత అండగా నిలుస్తోందని వివరించారు. ఎన్టీఆర్ జయంతి వేళ ఆయన చూపిన ప్రజా సంక్షేమ బాటలోనే పయనిస్తూ, నియోజకవర్గ సమగ్ర ప్రగతికి పునరంకితం అవుతామని ఉద్ఘాటించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story