Nacharam: నాచారం నుంచి ఉప్పల్ వెళ్లే వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్ కల్పించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Nacharam: హబ్సిగూడ చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నాచారం నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలకు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.

HARISH, TARNAKA
Updated on: 5 Sept 2026 4:23 PM IST
Nacharam
X

Nacharam: నాచారం నుంచి ఉప్పల్ వెళ్లే వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్ కల్పించాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నాచారం: నాచారం నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హబ్సిగూడ చౌరస్తాలో ప్రత్యేక ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి సమస్యను వివరించారు.

నాచారం నుంచి ఉప్పల్, తార్నాక వైపు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో హబ్సిగూడ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. సిగ్నల్ వద్ద వాహనదారులు 10 నుంచి 12 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వస్తోందన్నారు.

రద్దీ సమయాల్లో హబ్సిగూడ నుంచి హెచ్ఎంటీ నగర్ కమాన్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయని పేర్కొన్నారు. ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక ఫ్రీ లెఫ్ట్ లేకపోవడం వల్ల సిగ్నల్ కోసం వేచి ఉండాల్సి వస్తోందన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్రీ లెఫ్ట్‌కు అవసరమైన మేర రహదారిని విస్తరించాలని కోరారు.

నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్‌లు ఆక్రమణలకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి ఆక్రమణలు తొలగించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తిపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించి, త్వరలో నియోజకవర్గంలోని ఫ్రీ లెఫ్ట్‌లను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, విఠల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story