Peerzadiguda: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ ఫోకస్!
Peerzadiguda: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పీర్జాదిగూడ మల్లికార్జున్ నగర్ లో బూత్ లెవెల్ అధికారులతో కలిసి ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను సమీక్షించారు.
Peerzadiguda: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ ఫోకస్!
పీర్జాదిగూడ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు, బూత్ లెవల్ ఆఫీసర్లు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు.
బుధవారం మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధి బోడుప్పల్ సర్కిల్లోని పీర్జాదిగూడ డివిజన్ మల్లికార్జున్ నగర్ కాలనీలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), పీర్జాదిగూడ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీరాములు గౌడ్తో కలిసి కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, ఇతర దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై చర్చించారు.
ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులకు, పార్టీ ప్రతినిధులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న వజ్రేష్ యాదవ్, ప్రతి ఇంటికీ వెళ్లి అర్హుల వివరాలను సేకరించి, ఒక్క అర్హత ఓటరు కూడా ఓటరు జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జంగాచారి, పీర్జాదిగూడ డివిజన్ ఎస్ఐఆర్ ఇన్చార్జి మాధవి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




