Hyderabad: పని మానేశాడని కిడ్నాప్: అత్తాపూర్లో యువకుడిపై గ్యాంగ్ దాడి!
Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్లో దారుణం. పని మానేశాడన్న కోపంతో సద్దాం అనే యువకుడిని కిడ్నాప్ చేసి, 25 మందితో దాడి చేయించిన టైల్స్ కాంట్రాక్టర్ ఇక్బాల్.
Hyderabad: పని మానేశాడని కిడ్నాప్: అత్తాపూర్లో యువకుడిపై గ్యాంగ్ దాడి!
Hyderabad: హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గతంలో తన దగ్గర పనిచేసిన సద్దాం అనే యువకుడిపై తన అనుచరులతో దాడి చేయించాడు టైల్స్ కాంట్రాక్టర్ జవహర్ ఇక్బాల్. గతంలో సద్దాం.. ఇక్బాల్ దగ్గర పనిచేసేవాడు. అయితే.. ఆ తర్వాత కొన్ని కారణాలతో అతడి దగ్గర పని చేయడం మానేశాడు. తిరిగి తన వద్ద పనిచేయాలని సద్దాంను ఇక్బాల్ కోరగా.. అందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఇక్బాల్.. తన అనుచరులతో కలిసి సద్దాంను కిడ్నాప్ చేయించి.. చింతల్మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడి చేయించాడు.
సద్దాంపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అంతేకాదు.. అందరూ చూస్తుండగానే కర్రలతో కూడా దాడి చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానికులు.. డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసుల రాకను గుర్తించిన గ్యాంగ్.. అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనలో సద్దాంకు తీవ్రగాయాలు కాగా.. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
సద్దాంపై దాడికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులను ఆశ్రయించింది బాధిత కుటుంబం. 25 మంది గ్యాంగ్ సభ్యులు దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసింది. తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సద్దాం కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.




