LB Nagar: కమిటీల పేరుతో కాలయాపన వద్దు.. ఉద్యమకారులను ఆదుకోండి: వెంకటేష్ గౌడ్

LB Nagar: కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 13 Sept 2026 2:07 PM IST
LB Nagar
X

LB Nagar: కమిటీల పేరుతో కాలయాపన వద్దు.. ఉద్యమకారులను ఆదుకోండి: వెంకటేష్ గౌడ్

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ ఆరోపించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తూ కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ఉద్యమకారుల పాత్ర మరువలేనిదని ఆయన అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లే ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు.

అయితే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని వెంకటేష్ గౌడ్ అన్నారు. ఉద్యమకారుల సమస్యలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేకే కమిటీ ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యమకారులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు

- ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలి.

- ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలి.

- స్వాతంత్ర్య సమరయోధుల తరహాలో నెలకు రూ.25 వేల పింఛన్ అందించాలి.

- రూ.10 వేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

- బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలి.

- ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల గౌరవ వేతనం ఇవ్వాలి.

- ఉద్యమకారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రమాదాలు లేదా అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలి.

- తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలి.

- నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారి కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలి.

గత పదేళ్లుగా ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరిస్తాయన్న ఆశతో ఉద్యమకారులు ఎదురుచూస్తున్నారని వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కమిటీలు, సమీక్షల పేరుతో కాలయాపన చేయకుండా హామీలను అమలు చేయాలని కోరారు.

ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పడుతుందని పలు ఉద్యమకారుల సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కారింగుల నరేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జోర్క రాము ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి గోగిఖర్ కిషోర్ లాల్తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR