Pargi: పరిగి తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల దందా.. జేబు తడిపితేనే పని!
Pargi: పరిగి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి దందా. సర్టిఫికెట్ల కోసం ఆపరేటర్లు అడిగినంత ఇవ్వాల్సిందే.
Pargi: పరిగి తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల దందా.. జేబు తడిపితేనే పని!
PARGI: ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడానికి.. కానీ, పరిగి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నది మాత్రం సేవ కాదు.. అచ్చం వ్యాపారం! కుల ధృవీకరణ పత్రం కావాలా? ఆదాయ ధృవీకరణ పత్రం కావాలా? అయితే జేబులో ఐదు వందల నోటు ఉండాల్సిందే! లేదంటే సర్టిఫికెట్ వారాల తరబడి పెండింగ్లో ఉంటుంది. మరి ఇంత జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏంచేస్తున్నారు? వీరి మౌనం వెనుక మర్మమేంటి..సామాన్యులకు భరోసా ఇవ్వాల్సిన చోట, ఇప్పుడు అవినీతికి అడ్డాగా మారింది.
ఇక్కడ ఆపరేటర్లదే రాజ్యంగా నడుస్తోంది. కార్యాలయానికి వచ్చే సామాన్యులను చూసి, వీరు చూసే చూపుల్లో సేవ లేదు.. కేవలం 'లాభం' మాత్రమే కనిపిస్తోంది.డబ్బులు ఇస్తే గంటలో పని.. లేదంటే లంచ్ బాక్సులు సమర్పించుకోవాలి!
ఇది ఈ కార్యాలయంలో సాగుతున్న దారుణం. ఒక కాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా.. కౌంటర్లో ఉన్న ఆపరేటర్లు అడిగే మొదటి ప్రశ్న, "ఎంత ఇస్తారు?" అని. కనీసం ఐదు వందల రూపాయలు ఇస్తేనే సర్టిఫికెట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ డబ్బులు లేకపోతే.. లంచ్ బాక్సుల రూపంలో 'ముడుపులు' సమర్పించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. దోచుకుంటున్న ఈ ఆపరేటర్ల వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆఫీసులోనే ఇలాంటి దందాలు జరుగుతుంటే, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేంటి? వసూలు చేసిన ఈ సొమ్ములో 'వాటాలు' పైస్థాయికి అందుతున్నాయా? అందుకే వీరు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం పేదలకు సర్టిఫికెట్లు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముతో అందించాలని చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఆపరేటర్లు ఆ ఆదేశాలను బూటకమని తేల్చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, పరిగి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ఈ 'దందా'పై విచారణ జరపాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే, సామాన్యులకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతాయి.




