Ranga Reddy: భగభగమండే ఎండలు.. అలసత్వం వహిస్తే ప్రాణాంతకం

Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత, వడగాలులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ హెల్త్ అడ్వైజరీ విడుదల చేశారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 20 May 2026 7:33 PM IST
Ranga Reddy
X

Ranga Reddy: భగభగమండే ఎండలు.. అలసత్వం వహిస్తే ప్రాణాంతకం

Ranga Reddy: గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి ఐఏఎస్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. స్వర్ణ కుమారి గారు గారు జిల్లా ప్రజలు వేసవి ఎండల నుండి రక్షించుకొనుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగినది.

ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా వుంది కావున ఉదయం 10 గంటలు దాటిందంటే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. ఈ వేడి మరియు వడగాలుల నుండి రక్షించుకోకుండా ఏమాత్రం అలసత్వం వహించిన ఆసుపత్రి పాలు కావడం లేదా ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండ వేడి నుండి వడగాలుల నుండి రక్షించుకొనుటకు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత మరియు వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

కాబట్టి ప్రతి ఒక్కరు వడగాలుల నుండి ఎండ వేడిమి నుండి రక్షించుకోవడం, తగు జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము రక్షించుకోవడం అత్యంత అవసరం. తీసుకోవలసిన జాగ్రత్తలు

*ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్కువ నీరు తాగాలి. రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి

*నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

*లేత వర్ణము తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి

*పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. శుభ్రంగా రెండు పూటలా స్నానం చేయాలి

*మితంగా భోజనం చేయాలి

*ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి

* *ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి

* బయట తిరిగి వచ్చిన వెంటనే కొద్దిసేపు నీడలో కూర్చోవాలి. దీంతో శరీరం చల్లబడడంతో పాటు శరీరంలోని అవయవాలు కూడా చల్లబడుతాయి. ఎండలో తిరిగిన వారు కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు నీడలో సేద తీరిన తర్వాత స్వచ్ఛమైన నీరు తాగాలి.

* బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

* సూర్య రష్మి ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకపోవడం మంచిది.

* ఒకవేళ వెళ్లాల్సి వస్తే టోపీ, స్కార్ఫ్ వంటివి వాడాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.

బయటకు వెళ్లినప్పుడు వెంట త్రాగునీటి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి.

*ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లకపోవడమే మంచిది.

*రోడ్లమీద లభించే చల్లని రంగు పానీయాలు తాగరాదు.

*మాంసాహారం తగ్గించాలి మద్యం సేవించరాదు.

*నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు.

వడదెబ్బ కు గురి అయిన వ్యక్తికి చేయాల్సిన ప్రథమ చికిత్స

1. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి.

2. చల్లని నీటిలో ముంచిన తడి గుడ్డతో శరీరం తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు తుడుస్తూ ఉండాలి.

3. ఫ్యాను గాలి లేదా చల్లని గాలి తగిలేలా ఉంచాలి

4. ఉప్పు కలిపిన మజ్జిగ కానీ లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం కానీ త్రాగించాలి.

5. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదు.

6. వీలైనంత త్వరగా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story