Pargi: చౌడాపూర్లో నిజాయితీ చాటుకున్న బాలరాజు.. పోయిన బంగారం లభ్యం!
Pargi: మార్కెట్లో దొరికిన 3 తులాల బంగారాన్ని బాధితురాలికి అప్పగించి నిజాయితీ చాటుకున్న చౌడాపూర్ నివాసి బాలరాజు. డీఎస్పీ శ్రీనివాసు అభినందనలు.
Pargi: చౌడాపూర్లో నిజాయితీ చాటుకున్న బాలరాజు.. పోయిన బంగారం లభ్యం!
Pargi: మార్కెట్లో పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను గుర్తించి బాధితురాలికి తిరిగి అందజేసి ఓ వ్యక్తి నిజాయితీ చాటుకున్న ఘటన చౌడాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
చౌడాపూర్ మండలం పందివనంపల్లి గ్రామానికి చెందిన పంది సుజాత ఈ నెల 19వ తేదీ సాయంత్రం చౌడాపూర్ మార్కెట్కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు నాను, అర తులం బంగారు చెవికమ్మలు మార్కెట్ ప్రాంతంలో పోగొట్టుకుంది.
మరుసటి రోజు ఉదయం చౌడాపూర్ గ్రామానికి చెందిన భోయిని బాలరాజుకు మార్కెట్ ప్రాంతంలో బంగారు ఆభరణాలు దొరికాయి. వాటిని తన వద్ద ఉంచుకోకుండా వెంటనే బాధితురాలు సుజాతకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
అనంతరం పరిగి డీఎస్పీ శ్రీనివాసు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండల్ రెడ్డి సమక్షంలో బంగారు ఆభరణాలను బాధితురాలు సుజాతకు, ఆమె భర్త శ్రీనివాసులకు తిరిగి అందజేశారు.
బాలరాజు చూపిన నిజాయితీని పోలీసులు అభినందించారు. ఈ సందర్భంగా పరిగి డీఎస్పీ శ్రీనివాసు బాలరాజును సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంకటేష్, గ్రామస్తులు శంకరయ్య, పరిగి చందు తదితరులు పాల్గొన్నారు. బంగారం దొరికిన వెంటనే బాధితురాలికి సమాచారం అందించి తిరిగి అప్పగించిన బాలరాజు నిజాయితీని స్థానికులు ప్రశంసించారు.




