Hyderabad: ఈసీ నగర్లో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి సభ
Hyderabad: చర్లపల్లి ఈసీ నగర్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సంస్మరణ సభ. చిత్రపటానికి నివాళులర్పించిన కాలనీవాసులు, సీనియర్ సిటిజన్లు.
Hyderabad: ఈసీ నగర్లో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి సభ
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా చర్లపల్లి ఈసీ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్లో సోమవారం ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, సీనియర్ సిటిజన్లు పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ఈసీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జి. హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, ఉపాధ్యాయుడిగా అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతలో శాస్త్రీయ దృక్పథం, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు కలాం జీవితమే ఒక గొప్ప పాఠశాల అని పేర్కొన్నారు.
ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బి. శ్రావణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. కలలు కనడం మాత్రమే కాకుండా వాటిని సాధించే వరకు నిరంతరం శ్రమించాలని కలాం ఇచ్చిన సందేశం నేటి యువతకు ఎంతో ప్రేరణనిస్తోందని చెప్పారు.
హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎం. జగ్గరాజు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, కార్యదర్శి ఎం. మల్లేష్, ఎస్. శరత్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ తదితరులు మాట్లాడుతూ భారత క్షిపణి కార్యక్రమ అభివృద్ధిలో కలాం కీలక పాత్ర పోషించారని, అందుకే ఆయనను "మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా దేశం గౌరవించిందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, విద్యా రంగ పురోగతి, యువత సాధికారత కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.
వక్తలు మాట్లాడుతూ అబ్దుల్ కలాం సరళ జీవనం, ఉన్నత ఆలోచనలు, దేశాభివృద్ధి పట్ల అంకితభావం ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశాలని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డైరెక్టర్ బిక్షపతి, వాచస్పతి, ఆర్ విష్ణు, నవనీత, నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు. ఎస్. యాదయ్య వందన సమర్పణ చేశారు.




