Hyderabad: అన్నమయ్యపురంలో వైభవంగా కూచిపూడి, భరతనాట్య నృత్యార్చన!
Hyderabad: అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో శ్రీదేవి నాట్యాలయ శిష్యుల కూచిపూడి, భరతనాట్య నృత్య కైంకర్యం.
Hyderabad: అన్నమయ్యపురంలో వైభవంగా కూచిపూడి, భరతనాట్య నృత్యార్చన!
Hyderabad: అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం శ్రీదేవి నాట్యాలయ ఆధ్వర్యంలో గురువు శ్రీదేవి అరుణ్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో కూచిపూడి, భరతనాట్య నృత్యార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తొలుత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమవగా, అనంతరం శ్రీదేవి నృత్యాలయ శిష్యులు సంవిత, అక్షయ, సత్యవాణి, లక్ష్మీ శ్రావణి, బృందవి, కనిష్క, అక్షర, శ్రావణి పట్వారీ, మోక్ష తదితరులు కూచిపూడి నృత్యంతో, అలాగే ఎన్. మోక్ష, ఎన్. హాసిని, ఆశ్రిత, మేధ, రిధి, అన్విత, నిహాన్సా, ధార్మికి, ప్రహర్షిత, సాన్వి, స్మితిక, ఐశ్వర్య, మనుశ్రీ, ఖ్యాతి, ఎల్. శ్రావణి, వంశిక, ప్రణతి జి., రీవా, ఆద్రిక, ధన్విక తదితరులు భరతనాట్యంతో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి నృత్య కైంకర్యం సమర్పించారు.
ఈ సందర్భంగా “కృష్ణం కలయ సఖి, సతులారా చూడరే, తిరు తిరు జవరాల, కల్యాణ రామ, తాండవ గణపతి, మూషిక వాహన, అలరిపు, డోలాయాంచల, గరుడ గమన, పుష్పాంజలి, నారాయణతే, జనుత శబ్దం” వంటి భక్తిరసభరితమైన సంకీర్తనలు, నృత్యరూపకాలను శిష్యులు లయ, తాళం, భావాభినయ సమన్వయంతో ప్రదర్శించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
కూచిపూడి, భరతనాట్యంలోని సొగసైన నృత్య కదలికలు, హస్తముద్రలు, భావాభినయంతో అన్నమయ్య సంకీర్తనలలోని భక్తి తత్వాన్ని మేళవించి కళాకారులు చక్కగా ఆవిష్కరించగా, వారి నృత్యార్చన అన్నమయ్యపురంలో భక్తిరసాన్ని వెల్లివిరియజేసింది.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ అధ్యక్షులు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. నందకుమార్ గారు సంయుక్తంగా పాల్గొన్న కళాకారులను అభినందించి శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వరుని ప్రతిమను బహుకరించి, అన్నమయ్య సంకీర్తనలను నృత్యరూపంలో భక్తులకు చేరువ చేస్తున్న శ్రీదేవి నృత్యాలయ గురువు శ్రీమతి శ్రీదేవి అరుణ్ కుమార్ గారి కృషిని ప్రశంసించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణతో నృత్యార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ముగించారు.




