ATM Model Farming: 20 సెంట్లలో ఏటీఎం మోడల్ సాగు.. నెలకు ₹12 వేల ఆదాయం సాధిస్తున్న ఉద్దానం మహిళా రైతు!

ATM Model Farming: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళా రైతు సుహాసిని ఏటీఎం (ATM) మోడల్ విధానంలో 365 రోజులూ పంటలు సాగు చేస్తూ ప్రకృతి వ్యవసాయంలో నిరంతర ఆదాయం పొందుతున్న తీరుపై ప్రత్యేక కథనం.

Arun Chilukuri
Published on: 28 July 2026 12:23 PM IST
ATM Model Farming: 20 సెంట్లలో ఏటీఎం మోడల్ సాగు.. నెలకు ₹12 వేల ఆదాయం సాధిస్తున్న ఉద్దానం మహిళా రైతు!
X

ATM Model Farming: వ్యవసాయం అంటే కేవలం ఏటా ఒక్కసారి మాత్రమే పంట చేతికి వచ్చే రోజులు మారాయి. సరైన ప్రణాళిక, ప్రకృతి సిద్ధమైన సాగు పద్ధతులు పాటిస్తే ఏడాది పొడవునా ప్రతి వారం, ప్రతి రోజూ ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా సోమపేట మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు సుహాసిని. ఏటీఎం (Any Time Money) మోడల్ విధానంలో ఉద్యానవన పంటలను సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

రసాయనాలు వదిలి.. ప్రకృతి ఒడిలోకి!

గతంలో పదేళ్ల పాటు రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసిన సుహాసిని.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, తగ్గుతున్న భూసారంతో పాటు కుటుంబంలో ఎదురైన అనారోగ్య సమస్యలను గమనించారు. 2017లో ప్రకృతి వ్యవసాయ అధికారుల (CRP) అవగాహనతో ప్రభావితమై, 2018 నుండి పూర్తిగా ప్రకృతి సాగు విధానంలోకి అడుగుపెట్టారు.

ఏమిటీ 'ఏటీఎం' (ATM) మోడల్ సాగు?

ఏటీఎం అంటే బ్యాంక్ ఏటీఎం లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆదాయం అందించే పంటల నమూనా.

రైజ్డ్ బెడ్ల నిర్మాణం: కేవలం 20 సెంట్ల భూమిలో 4 అడుగుల వెడల్పుగల 21 రైజ్డ్ బెడ్లు సిద్ధం చేసి, బెడ్ల మధ్య 1 అడుగు కాలువను ఏర్పాటు చేశారు.

కాలానుగుణ దిగుబడి:

30 నుండి 40 రోజులకు ఆకుకూరలు

40 నుండి 50 రోజులకు దుంప జాతి పంటలు

45 రోజులకు పందిరి కూరగాయలు

60 రోజులకు మిరప, వంగ, టమాటా

90 రోజులకు క్యారెట్, బీట్రూట్ ఫలసాయం అందుతాయి.

రిలే సోయింగ్ (Relay Sowing): ఒక పంట కోతకు వస్తుండగానే దాని పక్కనే మరో విత్తనం నాటడం వల్ల భూమి ఖాళీగా ఉండకుండా 365 రోజులూ పంటలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

కీటక రహిత సాగు – జీవామృతాల ప్రయోగం

పంటలకు తెగుళ్లు ఆశించకుండా 20 రకాల జీవవైవిధ్య పంటలను మరియు ఎర్ర పంటగా బంతి పూల మొక్కలను పెంచుతున్నారు. నాటే ముందు బీజామృతంతో నారు శుద్ధి, గణజీవామృతం, ప్రతి 15 రోజులకు ద్రవజీవామృతం పిచికారీ చేయడం వల్ల ఎలాంటి పురుగుమందులు వాడకుండానే ఆరోగ్యకరమైన పంటలను సాధిస్తున్నారు.

నెలకు ₹10,000 నుండి ₹12,000 ఆదాయం

పండించిన కూరగాయలను నేరుగా స్థానిక గ్రామస్తులకు, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక స్టాళ్లకు విక్రయిస్తున్నారు. 20 సెంట్ల భూమి ద్వారా ప్రతిరోజూ కూరగాయలు కోస్తూ, నెలకు ₹10,000 నుండి ₹12,000 వరకు స్థిరమైన నిరంతర రాబడిని పొందుతున్నారు. రసాయనాలు లేని పౌష్టికాహారాన్ని అందిస్తూ, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్న సుహాసిని సాగు విధానం ప్రస్తుతం చుట్టుపక్కల రైతులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story