Vinukonda: వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆగ్రహం
Vinukonda: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని వినుకొండలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
Vinukonda: వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆగ్రహం
వినుకొండ: వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వినుకొండ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం సరికాదన్నారు.
ప్రజల ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకుంటూ, ప్రజా సమస్యలను గాలికొదిలేయడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు.అసెంబ్లీ సమావేశాలను ఎదుర్కొనే దమ్ము లేకే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు ముఖం చాటేశారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
అసెంబ్లీ నుంచి పారిపోయి పులివెందుల పిల్లుల్లా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆశిస్తుంటే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావడం ప్రజలకు అన్యాయం చేయడమేనన్నారు.
ఇక డీఎస్సీ అంశంలో మంత్రి నారా లోకేష్ బయటపెట్టిన వాస్తవాలతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా కూడా తెలియని వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మొత్తం 25 గంటల 15 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగగా, 103 మంది సభ్యులు సభలో ప్రసంగించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సభను వేదికగా చేసుకుంటుంటే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం సభకు దూరంగా ఉండటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు.




