Vinukonda: కళారంగాన్ని విస్మరిస్తే పోరాటం తప్పదు ప్రజానాట్యమండలి హెచ్చరిక!

Vinukonda: కళారంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తే పోరాటం తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి స్పష్టం చేసింది. వినుకొండలో పల్నాడు జిల్లా మహాసభలు నిర్వహణ.

KAREEMULLA, VINUKONDA
Published on: 23 Aug 2026 5:18 PM IST
Vinukonda
X

Vinukonda: కళారంగాన్ని విస్మరిస్తే పోరాటం తప్పదు ప్రజానాట్యమండలి హెచ్చరిక!

Vinukonda: ప్రజా చైతన్యానికి, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కీలకమైన కళారంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తే పోరాటం తప్పదని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి. చంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి చెన్నం పెంచలయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఆదివారం వినుకొండలో నిర్వహించిన పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రెండో మహాసభలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

ప్రభుత్వ ఆదరణ లేకపోవడంతో రాష్ట్రంలో సాంస్కృతిక రంగం దయనీయ పరిస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంస్కృతిక శాఖ ఉన్నప్పటికీ కళాకారులకు, కళారంగానికి ఆశించిన ప్రయోజనం అందడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కళారంగానికి తగినన్ని నిధులు కేటాయించకుండా కళారంగ అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

దేశంలో, రాష్ట్రంలో సామాన్య ప్రజల కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో పాలకుల విధానాలను ఎండగడుతూ నూతన కళారూపాలు, పాటలను రూపొందించి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజానాట్యమండలి నిరంతరం కృషి చేస్తోందన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకుని ప్రత్యేక ప్రణాళికతో కళా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ కళారూపాల ద్వారా ప్రజలను విస్తృతంగా చైతన్యవంతం చేయవచ్చన్నారు. పల్నాడు జిల్లాలోని కళాకారుల సంక్షేమం, గుర్తింపు కార్డుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ఆరెటి రామారావు, భూదాల శ్రీనివాసరావు, చెన్నకేశవులు, రవీంద్ర, జల్లి వెంకటేశ్వర్లు, ఎస్కే మస్తాన్, మందపాటి రమణారెడ్డి, ఉలవలపూడి రాము, కొప్పరపు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్నాడు జిల్లా ప్రజానాట్యమండలి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story