Bapatla: వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే!
Bapatla: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు సెంటర్ పరిధిలోని రైతాంగానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు.
Bapatla: వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది - ఎమ్మెల్యే!
బాపట్ల: తెలుగు రైతాంగానికి అత్యంత పవిత్రమైన పండుగల్లో ఏరువాక పున్నమి ఒకటి. భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అవినాభావ సంబంధాన్ని చాటిచెప్పే ఈ పండుగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రైతాంగానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు నేలతల్లికి నమస్కరించి, ఎడ్లను అలంకరించి కొత్త సాగు పనులకు శ్రీకారం చుట్టడం తెలుగు సంప్రదాయంలో ఒక విశిష్టమైన ఆచారమని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.
తొలకరి జల్లులతో నేల పదునెక్కిన వేళ, ఎడ్లకు పూజలు చేసి, కొత్త నాగలితో పొలంలో తొలి దుక్కిని ప్రారంభించడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమని, ఇది వ్యవసాయానికి, రైతుల జీవనానికి పశుసంపదకు ఉన్న విడదీయరాని బంధాన్ని తెలియజేస్తుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, రైతుల ఇళ్లు సిరిసంపదలతో కళకళలాడాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. రైతుల ఆర్థికాభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే తొలి విడత పీఎం-కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి తమ నిబద్ధతను నిరూపించుకున్నామని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు, పంట కాలంలో ఎదురయ్యే సమస్యలను అధికమైన శ్రద్ధతో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
అదేవిధంగా, సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు అవసరమైన రుణ సదుపాయాలను సులభతరం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, వారిని సాంకేతికతతో అనుసంధానం చేసేందుకు కూడా కృషి చేస్తున్నామని వివరించారు.
రైతులు ఆందోళన చెందకుండా, ధైర్యంగా సాగు పనులు చేపట్టాలని, ఎదురయ్యే ఏ సమస్యకైనా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఏలూరి భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హామీ ఇచ్చారు. ఏరువాక పున్నమి పర్వదినం రైతుల జీవితాల్లో నూతన ఆశలు, సిరిసంపదలు తీసుకురావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.




