Tadepalli: మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్ నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్!

Tadepalli: డీఎస్సీ-2025 నియామకాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని వైఎస్‌ఆర్‌సీపీ నేత వీర శేఖర్‌రెడ్డి ఆరోపించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Aug 2026 6:38 PM IST
Tadepalli
X

Tadepalli: మెగా డీఎస్సీ కాదు.. మెగా స్కామ్ నారా లోకేష్‌పై వైఎస్‌ఆర్‌సీపీ సవాల్!

Tadepalli: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలకు ప్రభుత్వ రికార్డులే సాక్ష్యాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీర శేఖర్‌రెడ్డి తేల్చి చెప్పారు. టెట్‌ అర్హత నిబంధనలను పక్కనపెట్టి, అర్హత మార్కులు సాధించని వారికీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో అర్హత లేనివారికీ టీచర్‌ ఉద్యోగాలు ఎలా కట్టబెట్టారో ఆధారాలతో సహా ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్‌ కోటాలో పరీక్ష లేకుండానే 382 పోస్టుల భర్తీ నుంచి జిల్లాల వారీగా వెలుగు చూసిన పలు కేసుల వరకు వివరించారు.

తాడేపల్లి వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని, పదే పదే చర్చకు సవాల్‌ చేస్తున్న నారా లోకేష్‌కు« ధైర్యం ఉంటే సమయం, తేదీ, వేదిక ఖరారు చేయాలని.. తానైనా లేక తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులైనా చర్చకు వస్తారని సవాల్‌ చేశారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిగితే నారా లోకేష్‌ జైలుకు వెళ్లక తప్పదని తేల్చి చెప్పారు.

ప్రెస్‌మీట్‌లో వీర శేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

‘టెట్‌’ నిబంధనలకు తూట్లు:

టీచర్‌ ఉద్యోగానికి టెట్‌ తప్పనిసరి. డీఎస్సీ నోటిఫికేషన్‌లోనే ఓసీకి 90, బీసీకి 75, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు రావాలని స్పష్టంగా ఉంది. కానీ అదే నిబంధనలను పక్కనపెట్టి టెట్‌ అర్హత లేని వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి.

పరీక్ష లేకుండానే 382 ఉద్యోగాలు:

స్పోర్ట్స్‌ కోటా పేరుతో జీవోలను మార్చి 382 పోస్టులను పరీక్ష లేకుండానే భర్తీ చేశారు. చదువు చెప్పాల్సిన టీచర్లకు పరీక్ష అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, లెక్కలు, సైన్స్, సోషల్‌ వంటి సబ్జెక్టులు బోధించే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం?.

డీఎస్సీ అక్రమాలపై ఇదిగో ఆధారాలు:

చిత్తూరు జిల్లా కేస్‌ స్టడీ:

– చిత్తూరు జిల్లాలో సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఓసీ అభ్యర్థికి టెట్‌లో 90 మార్కులు రావాలి. కానీ ఆ అభ్యర్థికి 79 మార్కులు మాత్రమే వచ్చాయి. నిబంధనల ప్రకారం అర్హత లేని అభ్యర్థికి స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా ఇచ్చారు? నారా లోకేష్‌ దీనికి సమాధానం చెప్పాలి.

కర్నూలు జిల్లా కేస్‌ స్టడీ:

– కర్నూలు జిల్లాలో ఎస్‌జీటీ పోస్టుకు బీసీ అభ్యర్థికి టెట్‌లో 75 మార్కులు రావాలి. కానీ 65 మార్కులే వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? టెట్‌ క్వాలిఫై కాకపోతే టీచర్‌ ఉద్యోగానికి ఎలా అర్హత వచ్చింది?’’

– అదే కర్నూలు జిల్లాకు చెందిన మరో మహిళా అభ్యర్థి మ్యాథమ్యాటిక్స్, సైన్స్‌ విభాగంలో టెట్‌ రాశారు. ఆ విభాగంలో అర్హత సాధించారు. కానీ నిబంధనలకు అనుగుణంగా కాకుండా వేరే సబ్జెక్టుకు ఉద్యోగం ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి. ఏ సబ్జెక్టులో అర్హత ఉంటే అదే సబ్జెక్టుకు పోస్టు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈ మార్పులు ఎలా జరిగాయి?.

కృష్ణా జిల్లా కేస్‌ స్టడీ:

– కృష్ణా జిల్లాలో స్పోర్ట్స్‌ కోటాలో ఎస్‌జీటీ ఉద్యోగం పొందిన ఒక అభ్యర్థికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే డీఎస్సీ ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌లో పేరు ఉంది. కానీ అభ్యర్థి సర్టిఫికెట్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్, టెట్‌ వివరాలు కనిపించడం లేదు. స్పోర్ట్స్‌ కోటాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 160 మంది జాబితాలో కూడా ఆ అభ్యర్థి పేరు లేదు. మరి ఉద్యోగం ఎలా వచ్చింది?.

కడప జిల్లా కేస్‌ స్టడీ:

– కడప జిల్లాలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికైన అభ్యర్థి వివరాలను పరిశీలిస్తే టెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ ఉంది. ఆ నంబర్‌తో టెట్‌ ఫలితం వెతికితే ‘నో రిజల్ట్‌ ఫౌండ్‌’ అని వస్తోంది. అయినా ఆ అభ్యర్థికి ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా వచ్చింది?’.

తూర్పు గోదావరి జిల్లా కేస్‌ స్టడీ:

– తూర్పు గోదావరికి చెందిన ఒక మహిళా అభ్యర్థి సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం పొందారు. ఆమె టెట్‌ను 11 సార్లు రాశారు. అయితే ఆ పరీక్షలన్నీ భాషా విభాగాలకు సంబంధించినవే. సోషల్‌ స్టడీస్‌పై టెట్‌ రాసినట్లు వివరాలు లేవు. భాషా టెట్‌ రాసిన అభ్యర్థికి సోషల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఎలా ఇచ్చారు?.

బీఈడీ లేకపోయినా ఉద్యోగం ఎలా?:

– అదే ఈస్ట్‌ గోదావరి అభ్యర్థి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో బీఈడీ సర్టిఫికెట్‌ సమర్పించ లేదని, ‘నాట్‌ క్వాలిఫైడ్‌’ అని ప్రభుత్వ అధికారి నమోదు చేశారు. కానీ ఫైనల్‌ లిస్ట్‌లో ఆ అభ్యర్థికి తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ అధికారి ‘నాట్‌ క్వాలిఫైడ్‌’ అని «ధృవీకరించిన తర్వాత ఉద్యోగం ఎలా వచ్చింది?.

ప్రకాశం జిల్లా కేస్‌ స్టడీ:

– ప్రకాశం జిల్లాలో బయలాజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపిౖMðన ఒక అభ్యర్థికి సంబంధించిన టెట్‌ వివరాలు కనిపించడం లేదు. ప్రభుత్వ వెరిఫికేషన్‌ వివరాల్లో టెట్‌ అర్హతకు సంబంధించిన ఆధారం లేకపోయినా ఉద్యోగం ఎలా వచ్చింది?.

ఆ ఐదు జిల్లాల డేటా ఎక్కడ?:

– ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ డేటా కనిపించడం లేదు. ఎలాంటి తప్పులు జరగకపోతే ఈ వివరాలు ఎందుకు అందుబాటులో లేవు? డీఎస్సీ నియామకాలకు సంబంధించిన పూర్తి డేటాను ప్రజల ముందుంచాలి.

అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి:

టీచర్లు మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తులు. అలాంటి నియామకాల్లో అర్హత, మెరిట్‌ పక్కనపెట్టి అనర్హులకు అవకాశం ఇస్తే నష్టపోయేది మన పిల్లలే. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరగకుండా, మొత్తం నియామక ప్రక్రియపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.

సీబీఐ విచారణకు సిద్ధమా?:

గ్రూప్‌–1 నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కాబట్టి తాము ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, డీఎస్సీలో ఏ అక్రమాలు జరగకపోతే, ప్రభుత్వం కూడా ధైర్యంగా ముందుకు రావాలని తేల్చి చెప్పారు. గ్రూప్‌–1తో పాటు, మెగా డీఎస్సీపైనా సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ముందుకు రావాలని, ఆ మేరకు సీబీఐకి లేఖ రాయాలని సవాల్‌ చేశారు. కానీ, ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు, ఏదేదో మాట్లాడుతున్నారు.

ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధం:

నారా లోకేష్‌ చర్చకు సిద్ధమని చెబుతున్నారు. ఆయన తన స్థాయి మర్చి జగన్‌గారిని సవాల్‌ చేస్తున్నారు. అయ్యా, లోకేష్‌.. నీది జగన్‌గారి స్థాయి కాదు. నీ సవాల్‌కు గతంలో మా మాజీ మంత్రి పేర్ని నాని గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా మేము అదే మాట్లాడుతున్నాం.

నిజంగా నీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రా. మా పార్టీ నుంచి నేను కానీ, మా మాజీ మంత్రులు కానీ చర్చకు వస్తారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తేదీ, సమయం, వేదిక ప్రకటించు. అన్ని ఆధారాలతో సహా వస్తాం. నీ అవినీతి వ్యవహారాన్ని ఎండగడతాం.

అలాగే సీఎం చంద్రబాబుకు «కూడా దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ అధినేత మాజీ సీఎం జగన్‌గారు చేసిన సవాల్‌ స్వీకరించాలి. గ్రూప్‌–1తో పాటు, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు లేఖ రాయాలి.

పక్కా ఆధారాలు. ఇవీ. ఇలా..:

మేము చెబుతున్న ప్రతి అంశానికి ప్రభుత్వ శాఖల నుంచే వచ్చిన పత్రాలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వివరాలు, టెట్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నాం. విద్యావేత్తలు, రిటైర్డ్‌ అధికారులు వాటిని పరిశీలించిన తర్వాతే మీడియా ముందుకు తీసుకొచ్చామని, అందుకే వాటిని మీడియాకు కూడా అందజేస్తున్నామని వీర శేఖర్‌రెడ్డి వివరించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story