Mangalagiri: నాగార్జున హైస్కూల్లో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
Mangalagiri: మంగళగిరి మండలం పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాలు ఘనంగా జరిగాయి.
Mangalagiri: నాగార్జున హైస్కూల్లో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో శనివారం తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నాదెండ్ల అప్పారావు పాల్గొని తెలుగు భాష గొప్పతనం, ప్రాధాన్యతను వివరించారు.
తెలుగు భాషకు ఘనమైన చరిత్ర, సాహిత్య సంపద, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని, మాతృభాషను గౌరవిస్తూ చదవడం, రాయడం, మాట్లాడటం ద్వారా భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
తెలుగు వాడుక భాషోద్యమానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రాంథిక భాషకు బదులుగా ప్రజలకు సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాషను ప్రోత్సహించడంలో గిడుగు రామమూర్తి సేవలు చిరస్మరణీయమన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు తెలుగు పాటలు, పద్యాలు, నాటకాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఇచ్చారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో నాగార్జున హైస్కూల్ డైరెక్టర్ జొన్నలగడ్డ రాఘవయ్య, ప్రిన్సిపల్ జొన్నలగడ్డ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




