Mangalagiri: మహానాడు మిషన్ క్లస్టర్ స్థాయిలో టీడీపీ భారీ కసరత్తు
Mangalagiri: ఈసారి సరికొత్తగా 'హైబ్రిడ్' విధానంలో టీడీపీ మహానాడు. 1875 క్లస్టర్ ఇంచార్జులతో లోకేష్ ఆన్లైన్ రివ్యూ. ఈ ఏడాది థీమ్ “స్త్రీ శక్తి మహానాడు”గా ఖరారు.
Mangalagiri: మహానాడు మిషన్ క్లస్టర్ స్థాయిలో టీడీపీ భారీ కసరత్తు
Mangalagiri: మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం కాదని, అది తెలుగుదేశం పార్టీ బలం, క్రమశిక్షణ, త్యాగం, సంస్థాగత శక్తికి ప్రతీక అని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ ఇంఛార్జ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన ఆయన, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
*నెల్లూరు నుంచి మంగళగిరికి.. హైబ్రిడ్ మహానాడు నిర్ణయం*
మొదట నెల్లూరులో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించాలని భావించినా, అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన పొదుపు చర్యల నేపథ్యంలో ఈసారి హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రధాని Narendra Modi పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యక్రమం జరుగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రాల్లో వర్చువల్ రూపంలో మహానాడు నిర్వహించనున్నారు.
*ఈసారి థీమ్ – “స్త్రీ శక్తి మహానాడు”*
ఈ ఏడాది మహానాడును “స్త్రీ శక్తి మహానాడు” థీమ్తో నిర్వహిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి క్లస్టర్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
*క్లస్టర్ బలోపేతానికి ఇదే సరైన సమయం*
కుటుంబ సాధికార సారధి నుంచి బూత్ ఇంఛార్జ్లు, గ్రామ కమిటీలు, క్లస్టర్ కమిటీ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ మహానాడులో పాల్గొనాలని సూచించారు. క్లస్టర్ వ్యవస్థను మరింత బలపరచడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య అనుబంధం పెంచడమే లక్ష్యమని వివరించారు.
సాంకేతిక సన్నాహాలు తప్పనిసరి
ప్రతి క్లస్టర్ కేంద్రంలో ఎల్ఈడీ టీవీలు, స్పీకర్లు, అవసరమైన సాంకేతిక వసతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీ తరఫున అవసరమైన మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. హాజరును మై టీడీపీ యాప్ ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు.
*బూత్ నుంచి అనుబంధ విభాగాల వరకు అందరికీ ఆహ్వానం*
కేఎస్ఎస్, బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల సభ్యులందరినీ మహానాడుకు ఆహ్వానించాలని లోకేష్ సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
*పండుగలా మహానాడు.. పార్టీకి కొత్త ఊపు*
మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలని లోకేష్ అన్నారు. వ్యక్తులు కాదు, వ్యవస్థే శాశ్వతమని గుర్తు చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్లకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
*స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఇప్పటి నుంచే ఫీల్డ్లోకి*
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకే నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. గత రెండు సంవత్సరాలుగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఇప్పుడు మరింత వేగంగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
*పనిచేసేవారికే గుర్తింపు*
పార్టీ కోసం కష్టపడేవారిని మై టీడీపీ యాప్ ద్వారా గుర్తిస్తున్నామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో కూడా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై కూడా పనితీరే ప్రమాణంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఈసారి మహానాడు కేవలం సమావేశం కాదు. పార్టీ శక్తిని క్లస్టర్ స్థాయిలో పరీక్షించే భారీ రాజకీయ వ్యూహంగా మారబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.




