Guntur: గుంటూరులో 25 వేల మందితో 'గ్రీన్ గణేష్' విగ్రహాల తయారీ!
Guntur: ఈ నెల 11న గుంటూరులో 25 వేల మంది విద్యార్థులతో ఏకకాలంలో మట్టి వినాయక ప్రతిమల తయారీ చేపట్టనున్నారు.
Guntur: గుంటూరులో 25 వేల మందితో 'గ్రీన్ గణేష్' విగ్రహాల తయారీ!
గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ ఈ నెల 11న ఏకకాలంలో 25 వేల మంది విద్యార్ధులతో రికార్డ్ స్థాయిలో గ్రీన్ గణేష్ మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమం విద్యార్ధుల్లో పోటీ కాదని, పర్యావరణంపై అవగాహన కల్గిస్తూ, నవ గుంటూరు నిర్మాణంలో భాగస్వామ్యం చేయడమేనని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నగరంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, విద్యా శాఖ, జిఎంసి అధికారులతో "గ్రీన్ గణేష్" మట్టి వినాయక ప్రతిమల తయారీ (వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్) కార్యక్రమం నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాల వలన భూమి, నీరు, గాలి కలుషితమై ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందన్నారు. పండగలు పర్యావరణ హితంగా జరిగి భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంని అందించే కృషిలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఏకకాలంలో విద్యార్ధులతో మట్టి వినాయక ప్రతిమల తయారీకి పూనుకుందన్నారు. విద్యార్ధుల్లో పర్యావరణంపట్ల అవగాహన కల్గిస్తే రానున్న కాలంలో వారే పర్యావరణ పరిరక్షకులు అవుతారన్నారు.
కనుక ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నగరంలో సుమారు 60 పాఠశాలల్లో ఏకకాలంలో విద్యార్ధులు స్వచ్చందంగా మట్టి విగ్రహాలు తయారు చేస్తారన్నారు. ఈ విధంగా చేయడం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నమోదు అవుతుందని, ప్రతి పాఠశాలలో విద్యార్ధులు ఎక్కడికీ రాకుండా వారి పాఠశాల ప్రాంగణంలోనే జిఎంసి అందించే విత్తనాలు కలిపినా మట్టితో విగ్రహాలు చేయాలన్నారు. పాల్గొన్న విద్యార్ధికి, పాఠశాలకు ప్రత్యేకంగా జిఎంసి నుండి అభినందన సర్టిఫికెట్ అందిస్తామని తెలిపారు. కనుక నగరంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఏ విద్యార్ధిని బలవంతంగా కాకుండా స్వచ్చందంగా పాల్గొనేలా విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.
తొలుత కమిషనర్ గ్రీన్ గణేష్ కార్యక్రమంని సెంట్రలైజ్డ్ గా పర్యవేక్షణ చేసే నగరపాలక సంస్థ ఎన్టీఆర్ స్టేడియంను జిఎంసి ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించి, ఏర్పాట్లపై తగు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల్లో అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపీ సూరజ్ కుమార్, ఉపా సెల్ పిఓ సింహాచలం, ఎంఈఓలు ఖుద్దూస్, నాగేంద్రం, జ్యోతి కిరణ్, షరీఫ్ పాల్గొన్నారు.




