Vinukonda: ముఖ్యమంత్రికి బదులు ఏఐనే పాలించమనండి!
Vinukonda: వినుకొండలో మోకాళ్లపై నడిచి దస్తావేజు లేఖరుల నిరసన. జీవో 396 రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 4వ రోజు పెన్డౌన్.
Vinukonda: ముఖ్యమంత్రికి బదులు ఏఐనే పాలించమనండి!
Vinukonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెన్డౌన్ కార్యక్రమం గురువారం నాలుగవ రోజుకు చేరుకుంది. వినుకొండ దస్తావేజు లేఖరులు నాలుగో రోజు వినూత్నంగా మోకాళ్లపై నడిచి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఏఐ ద్వారా రూపొందిస్తామని చెప్తున్నా ముఖ్యమంత్రి.... ఆయనకు బదులు ఏఐ చేత పరిపాలన సాగించవచ్చు కదా అని ధ్వజమెత్తారు.
టెక్నాలజీ వినియోగానికి తాము వ్యతిరేకం కాదని, దశాబ్దాలుగా ఉన్న వృత్తిని లేకుండా చేస్తూ తీసుకొచ్చిన 396 జీవో పైనే తమ పోరాటమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖర్లను చిన్నచూపు చూస్తూ, వారి ప్రభావం పెద్దగా ఉండదని ప్రచారం చేస్తుందని ఇది ప్రభుత్వ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వారు లేఖర్లు మండిపడ్డారు.దస్తావేజులు రూపకల్పనలో కక్షిదారులకు ఆస్తి హక్కులు, ఆస్తి బదిలీ చట్టబద్ధంగా ఎలా చేసుకోవాలో సలహాలు ఇస్తూ దస్తావేజులు తయారు చేస్తూ ప్రజలకు రిజిస్టర్ కార్యాలయాలకు వారిధిగా పనిచేస్తున్న దస్తావేజులేఖర్లను దళారురులుగా పేర్కొనటం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని, RSK లో 2000 వసూలు చేసే ప్రభుత్వం కమీషన్ ఏజెంట్ కాదా? అని ఎద్దేవా చేశారు.
తక్షణమే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరణ చేయడం ఉపసంహరించుకోవాలని, 396 జీవోను వెంటనే రద్దు చేయాలని వినుకొండ దస్తావేజులేఖర్లు డిమాండ్ చేశారు. 396 జీవోని అమలు చేసి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు తీసుకుని వస్తే పి పి పి అనేది ప్రజలను పీల్చి పిప్పి చేసేదిగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విధానంలో లోపాలు ఉంటే సరిదిద్దాలే గాని, దస్తావేజు లేఖరి వ్యవస్థను నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం సరికాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని దస్తావేజులేఖరులకు వృత్తికి భరోసా ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఏఐ అన్ని రంగాలను విధ్వంసం చేస్తుందని వేలాది ఉద్యోగాలను కాలరాస్తుందని, ఏఐ ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టెక్నాలజీ పేరుతో వ్యవస్థలను విధ్వంసం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.




