Kukunoor: కుక్కునూరులో రోడ్లపైనే పొట్టు లారీలు.. పట్టించుకోని అధికారులు!
Kukunoor: నర్సరీల కోసం వచ్చే పొట్టు లారీలను ఆర్అండ్బీ రోడ్లపైనే నిలిపి అన్లోడ్ చేస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Kukunoor: కుక్కునూరులో రోడ్లపైనే పొట్టు లారీలు.. పట్టించుకోని అధికారులు!
కుక్కునూరు: కుక్కునూరు మండలంలో నర్సరీల వ్యాపారం పేరుతో రహదారి భద్రతను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంజరగూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం, వేలేరు తదితర గ్రామాల్లో జామాయిల్, జామ క్లోన్ నర్సరీలు సుమారు పది వేల వరకు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
నర్సరీల్లో మొక్కల పెంపకానికి అవసరమైన పొట్టును లారీల ద్వారా తరలిస్తున్న కొందరు వ్యక్తులు ఆర్అండ్బీ రోడ్లపైనే లారీలను నిలిపి ట్రాక్టర్లలోకి అన్లోడ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గంటల తరబడి రహదారిపై భారీ వాహనాలు నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారులపై ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నా సంబంధిత ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా ముందే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. రోడ్డుపై లారీలు నిలిపి పొట్టు అన్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, రహదారులపై అడ్డంకులు లేకుండా అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




