Kukunoor: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 6వ వర్ధంతి వేడుకలు!
Kukunoor: కుక్కునూరు సుందరయ్య భవనంలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య 6వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
Kukunoor: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య 6వ వర్ధంతి వేడుకలు!
కుక్కునూరు: ప్రజా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినట్లు సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ తెలిపారు.
సోమవారం స్థానిక సుందరయ్య భవనం ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సున్నం రాజయ్య ఆదర్శాలకు నిలువెత్తు నిదర్శనమని, అవినీతి మచ్చలేని నిజాయితీ గల నాయకుడిగా జీవితాంతం పేదలు, గిరిజనులు, రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాడారని కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఇచ్చిన ప్రతి ఉద్యమ పిలుపులో ముందుండి పాల్గొంటూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసిన గొప్ప నాయకుడు రాజయ్య అని అన్నారు. నేడు దేశంలో ఆర్ఎస్ఎస్–బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులపై దమనకాండ కొనసాగిస్తోందని విమర్శించారు.
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలను నిర్మించడమే కామ్రేడ్ సున్నం రాజయ్యకు ఇచ్చే నిజమైన ఘన నివాళి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
రాజయ్య అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిర్భయంగా గళం విప్పడమే కాకుండా తన మాతృభాష కోయలో సైతం గిరిజనుల సమస్యలను ప్రస్తావించి పోరాడిన ప్రజానాయకుడని గుర్తు చేశారు. ఆయన ఆశయాల సాధనకు ప్రజలంతా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు షేక్ మహబూబ్ పాషా, షేక్ వలిపాషా, పూలదాసు రమేష్, కారం రమేష్, కాకా కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




