తెలంగాణ విద్యార్థి అద్భుత ప్రతిభ.. చదువుకుంటూనే 'మామాఅర్త్' లో ఏఐ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ సొంతం!
AI engineering: తెలంగాణ కొత్తగూడెం విద్యార్థి కేశవ్ మక్కాడ్ అద్భుత ప్రతిభ. స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతూనే మామాఅర్త్ లో ఏఐ ఇంటర్న్షిప్ సాధన.
Keshav Makkad
AI engineering: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ తెలంగాణకు చెందిన ఒక సాధారణ విద్యార్థి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. డిగ్రీ పూర్తి కాకముందే ప్రముఖ బ్రాండ్ 'మామాఅర్త్' (Mamaearth) లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ సాధించి వార్తల్లో నిలిచాడు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ప్రాక్టికల్ ఏఐ నైపుణ్యాలకు మార్కెట్లో ఎంతటి ఆదరణ ఉందో అనడానికి ఈ విజయమే ఒక నిదర్శనం.
'స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ' (Scaler School of Technology) కి చెందిన కేశవ్ మక్కాడ్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తెలంగాణలోని కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కేశవ్, ప్రస్తుతం తన ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కోవిడ్ సమయంలో 2023లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అతనికి, జేఈఈ (JEE) కి సిద్ధమవడానికి చాలా తక్కువ సమయం దొరికింది. అయినప్పటికీ, ఆన్లైన్ లెర్నింగ్ వనరులపై ఆధారపడి జేఈఈలో 86.6 పర్సంటైల్ సాధించాడు. అనంతరం కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై ప్రత్యేక ఫోకస్ ఉన్న ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో చేరాడు.
కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా.. శ్రమించి నేర్చుకుని:
క్యాంపస్లో అడుగుపెట్టే సమయానికి కేశవ్కు ఎలాంటి ముందస్తు కోడింగ్ అనుభవం (Prior Coding Experience) లేదు. పూర్తిగా మొదటి నుండి ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. కఠినమైన కోర్స్వర్క్, ప్రాక్టికల్ ప్రాజెక్టుల ద్వారా కేవలం రెండేళ్లలోనే కంప్యూటర్ సైన్స్పై పట్టు సాధించాడు. ఆ తర్వాత క్రమంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల వైపు తన నైపుణ్యాలను విస్తరించుకున్నాడు.
ఈ క్రమంలోనే తన రెండో సంవత్సరంలో నోయిడాకు చెందిన 'ట్రేడ్ ఇండియా' (TradeIndia) సంస్థలో ఫుల్-స్టాక్ డెవలపర్గా మొదటి ఇంటర్న్షిప్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'జిప్మాట్' (ZippMat) లోనూ ఇంటర్న్ చేశాడు. ప్రస్తుతం ప్రముఖ కంపెనీ 'మామాఅర్త్' లో ఏఐ ఇంజనీరింగ్ ఇంటర్న్గా పనిచేస్తూ, అకడమిక్ చదువులతో పాటే కంపెనీ యొక్క కీలకమైన ఏఐ ప్రాజెక్టులపై వర్క్ చేస్తున్నాడు.
క్యాంపస్లో వినూత్న ఆవిష్కరణలు:
కేశవ్ కేవలం ఇంటర్న్షిప్లకే పరిమితం కాకుండా తన క్యాంపస్ కోసం ఒక వినూత్న టెక్నాలజీ సొల్యూషన్ను రూపొందించాడు. గతంలో మాన్యువల్గా జరిగే పరీక్షల సీటింగ్ ప్లానింగ్ను సులభతరం చేస్తూ ఒక 'ఆటోమేటెడ్ ఎగ్జామినేషన్ సీటింగ్ ప్లాన్ జనరేటర్' ను డెవలప్ చేశాడు. దీంతో పాటు టీచింగ్ అసిస్టెంట్గా జూనియర్ విద్యార్థులకు మెంటర్గా వ్యవహరిస్తూ, క్యాంపస్లో స్టూడెంట్ మీడియా క్లబ్ను స్థాపించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు.
తన సక్సెస్ జర్నీ గురించి కేశవ్ మాట్లాడుతూ.. అకడమిక్ ర్యాంకుల కంటే నిరంతర శ్రమ, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యమని చెప్పాడు. చిన్న నగరాల నుండి వచ్చే విద్యార్థులు ఆన్లైన్ లెర్నింగ్ అవకాశాలను, ప్రాక్టికల్ ప్రాజెక్టులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుని సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని పిలుపునిచ్చాడు. 2027లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయనున్న కేశవ్, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనే స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. డిగ్రీ పూర్తి కాకముందే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు ఎలా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ సాధించవచ్చో అనడానికి కేశవ్ ప్రయాణం ఒక చక్కని ఉదాహరణ.




