స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడం ఖాయం: తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్కుమార్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
చిత్తూరు: క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయం సాధించడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్కుమార్ అన్నారు. పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు.
సామాజిక పింఛన్లు,తల్లికి వందనం, రహదారుల అభివృద్ధి తదితర కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చిత్తూరు నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పనిచేస్తున్నారని వరుణ్కుమార్ పేర్కొన్నారు. అడవిపల్లి రిజర్వాయర్ ద్వారా చిత్తూరుకు తాగునీరు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.




