Sullurupeta: పారిశుద్ధ్య కార్మికులకు కరువైన రక్షణ పరికరాలు!

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 14 Jun 2026 6:25 PM IST
Sullurupeta
X

Sullurupeta: పారిశుద్ధ్య కార్మికులకు కరువైన రక్షణ పరికరాలు!

​సూళ్ళూరుపేట: సమాజంలో మనం మనుషులమే కదా? సాటి మనిషి పట్ల కనీస మానవత్వం, జాలి చూపాల్సిన బాధ్యత లేదా? తిరుపతి జిల్లా, సూళ్ళూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల దయనీయ స్థితిని చూస్తుంటే, స్థానిక అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరినట్లు స్పష్టమవుతోంది. కనీస రక్షణ పరికరాలు అందించకపోవడంపై కార్మికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​నిత్యం ప్రాణాలకు తెగించి మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్మికులకు చేతికి గ్లౌజులు, కాళ్లకు గమ్ షూలు, ముఖానికి మాస్కులు కూడా ఇవ్వలేని దుస్థితిలో పంచాయతీ యంత్రాంగం ఉండటం అత్యంత విచారకరం. అంటువ్యాధుల ముప్పు ఉందని తెలిసినా, అధికారుల ఉదాసీనత వల్ల కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. "మేము కూడా మనుషులమే కదా, మా ప్రాణాలకు విలువ లేదా?" అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​అయితే, ఈ పంచాయతీ అధికారుల తీరుపై గతంలో కూడా అనేక విమర్శలు ఉన్నాయి. అనేక పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, కనీస వసతులు కల్పించడంలో చూపిస్తున్న ఈ నిర్లక్ష్యం అధికారుల అనాలోచిత ధోరణికి నిదర్శనం. ప్రతి 60 రోజులకు ఒకసారి జరిగే "డివిజన్ లెవెల్ మానిటరింగ్ కమిటీ సమావేశాల్లో" ఇటువంటి విషయాలపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి.

​పని చేసే కార్మికులకు అన్ని రక్షణ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోటపోలూరు పంచాయతీ అధికారుల తీరుపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికుల భద్రత పట్ల చిన్నచూపు మానుకొని, వారికి అవసరమైన వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story