Madanapalle: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
Madanapalle: మదనపల్లెలో భార్య దండామణిని భర్త మధుకర్ రెడ్డి హత్య చేశాడు. నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Madanapalle: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం కోళ్లబైలు-1, బయారెడ్డి కాలనీలో శనివారం సాయంత్రం దారుణ హత్య చోటుచేసుకుంది. దండామణి (38) అనే మహిళను ఆమె భర్త మధుకర్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు, సీఐ కథా వెంకటరమణ, ఎస్సై విష్ణు నారాయణ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బుచ్చిరాజు మాట్లాడుతూ.. నిందితుడు మధుకర్ రెడ్డికి గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు.
ఏటీఎం దొంగతనం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడని, తంబళ్లపల్లె ప్రాంతంలోనూ అతనిపై కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14న బెయిల్పై జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగానే ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు.
నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. మృతురాలికి అమృత రెడ్డి (8వ తరగతి), జస్వంత్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




