Madanapalle: "జలధార" అమలులో లోపాలు.. బహుజన యువసేన ఆందోళన!
Madanapalle: మదనపల్లెలో "జలధార" అమలులో తీవ్ర లోపాలున్నాయని, FTL గుర్తింపు లేకుండా పనులు చేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని బహుజన యువసేన EEకి వినతిపత్రమిచ్చింది.
Madanapalle: "జలధార" అమలులో లోపాలు.. బహుజన యువసేన ఆందోళన!
"జలధార" అమలులో లోపాలు.. ప్రజాధనం వృథా అవుతోందని బహుజన యువసేన ఆందోళన
ఇరిగేషన్ ఈఈకి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్
మదనపల్లె, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "జలధార" చెరువుల పునరుద్ధరణ పథకం క్షేత్రస్థాయిలో తీవ్ర లోపాలతో అమలవుతోందని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు.
ఈ మేరకు మదనపల్లె ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, ఫీడర్ కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాల్లో పెద్దఎత్తున అక్రమ ఆక్రమణలు కొనసాగుతున్నప్పటికీ, వాటిని తొలగించకుండా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే తవ్వకాలు చేపడుతున్నారని విమర్శించారు.
రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో సంయుక్త సర్వే నిర్వహించకుండా, ఎఫ్టీఎల్ (FTL) సరిహద్దులను గుర్తించకుండానే పనులు చేపట్టడం వల్ల చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగదని, ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని పేర్కొన్నారు. మదనపల్లె డివిజన్ పరిధిలోని అన్ని చెరువులు, కుంటలు, కాలువలపై రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా వెంటనే సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే ఎఫ్టీఎల్ సరిహద్దులను స్పష్టంగా గుర్తించి శాశ్వత సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, నీటి ప్రవాహ మార్గాలు మరియు చెరువుల పరిధిలో ఉన్న అన్ని అక్రమ ఆక్రమణలను చట్టప్రకారం తొలగించాలని కోరారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించిన అనంతరమే నాణ్యతా ప్రమాణాలతో పునరుద్ధరణ పనులు చేపట్టి, ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పునీత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.




